సరిహద్దుల్లో చిక్కుకున్నా మంత్రి చొర‌వ‌తో  తండాకు చేరుకున్న కూలీలు!

తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో వ‌ల‌స కూలీలు త‌మ సొంత గూటికి చేరుకున్నారు. సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్నారు. 

అక్కడే పని లేక సొంత గూటికి చేరుకోలేక పులిచింతల ప్రాజెక్ట్ అవల చిక్కుకున్నారు. ఎంత బ్రతిమలాడిన నిబంధనలు ఒప్పుకోవు అంటూ సరిహద్దుల్లో వారి రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో మంత్రి జగదీష్ రెడ్డి సెల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ లో నేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులను వారి సొంతూరికి చేర్చాలంటూ ఆదేశించారు. ఆదేశించడంతో పాటు పలుమార్లు వాకబు చేస్తూ వారు సొంతూరికి చేరేదాకా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.దీనితో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోదాడ ఆర్ డి ఓ కు వారిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకు రావాలి అంటూ పురమాయించారు.

దానితో రంగంలోకి దిగిన ఆర్ డి ఓ పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుని ఆదివారం పొద్దు పోయేంత వరకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి వారి సొంత గ్రామాలకు చేరేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.ఎట్టకేలకు యింటికి చేరుకున్న తండా వాసులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఫోన్ ఎత్తడం తో పాటు సురక్షితంగా తమను గమ్యానికి చేర్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.