చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్ గారు!!

ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులు, మహిళల విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. మహిళల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లల పట్ల కూడా జాలి చూపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితో పాటు నిరసనలో పాల్గొన్న ఒక చిన్న పిల్లాడిని అరెస్టు చేసిన ఫోటోని లోకేష్ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. అంతేకాకుండా ఓ యువతితో భత్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఉన్న మరో ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

'చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు వైఎస్ జగన్ గారు. వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం.’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెప్తే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళల పై జగన్ గారికి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్ధం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని లోకేష్ నిలదీశారు.