వ్యక్తి మృతి కేసులో ఏ1 ముద్దాయిగా కోడి అరెస్ట్.. రీజన్ ఇదే..

ఏమిటి ఆశ్చర్య పోతున్నారా .. ఒక వ్యక్తి చనిపోతే కోడిని అరెస్ట్ చేయడమేంటని.. ఈ ఘటన నిజంగానే తెలంగాణాలో జరిగింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. అతడు తన స్నేహితులతో కలిసి తరచుగా కోడిపందేలు నిర్వహిస్తుంటాడు. అయితే కోడిని పందెంలో దించే సమయంలో పొరపాటున కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ మరణానికి కారణమైన కోడిని పట్టుకొచ్చి స్టేషన్‌లో కట్టేశారు.అంతేకాకుండా ఆ కోడితోపాటు అక్కడ పందేలు ఆడినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

 

మరోపక్క సతీష్ మరణానికి కోడే కారణమని తేల్చిన పోలీసులు దాన్ని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలో ఆ కోడిని కోర్టులో కూడా హాజరు పరచనున్నారు. అప్పటివరకు ఆ కోడి బాగోగుల భారం పోలీసులపై ఉండడంతో దానిని చూసుకునేందుకు వారు నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం ఆ కోడిని కాసేపు సెల్‌లో, మరికాసేపు చెట్టుకిందకు మార్చి దానికి గింజలు వేస్తున్నారు. అయితే కోడిపుంజును కట్టివేయడంతో అది తన కూతలతో పోలీస్ స్టేషన్‌ టాప్ లేపుతోంది