మోనితను కోర్టుకు లాక్కొచ్చిన వంటలక్క!?
on Sep 12, 2021
మోనిత నాటకానికి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చినట్టుంది. 'కార్తీకదీపం' సీరియల్లో శనివారం ఇచ్చిన ముగింపు చూస్తే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది. మొత్తం మీద భర్త కార్తీక్కు శిక్ష పడకుండా, పతి ప్రాణాలను వంటలక్క కాపాడినట్టు తెలుస్తోంది. అసలు ఏమైంది? అనేది వివరాల్లోకి వెళితే...
దీపను మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కంగారు పడుతుంటే, అదేమీ పట్టించుకోకుండా విధి నిర్వహణలో భాగంగా అతడికి ఏసీపీ రోషిణి కోర్టుకు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు మోనితను ఫాలో అవుతూ వెళ్లిన దీప, చివరికి మోనిత చేతికి చిక్కుతుంది. గన్ తీసుకుని దీపకు మోనిత గురి పెడుతుంది.
కట్ చేస్తే... కోర్టులో కార్తీక్ మీద మోపిన అభియోగాలపై విచారణ జరుగుతుంది. మోనితను కార్తీక్ గర్భవతి చేశాడని, ఆమె తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి చంపేశాడని, అతడికి శిక్ష విధించాలని న్యాయవాది వాదిస్తాడు. సాక్ష్యాలు అన్నీ కార్తీక్ కి వ్యతిరేకంగా ఉంటాయి. అతడి తల్లి మాత్రం 'నా మనస్సాక్షి ప్రకారం నా కుమారుడు నిర్దోషిగా బయటకొస్తాడు' అని నమ్మకంగా ఉంటుంది.
దీపకు గన్ గురి పెట్టిన మోనిత... చంపేస్తానని బెదిరిస్తోంది. దీప ఏమాత్రం కంగారు పడకుండా ఒకటి, రెండు అని అంకెలు లెక్కపెడుతూ మోనిత చేతిలో గన్ లాక్కుంటుంది. దాంతో దీప కాళ్ళ మీద పడిన మోనిత... తనను వదిలేయమని, ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. 'నువ్వు బతికుంటే నా భర్త ప్రాణాలకు ప్రమాదం. నిన్ను చంపేస్తా' అని దీప భయపెడుతుంది. దాంతో ఎపిసోడ్ దాదాపుగా ముగిసింది. అయితే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం రాబోతోందనేది చూపించిన ప్రోమోలో అసలు మేటర్ ఉంది.
'వాదోపవాదనలు ముగిశాయి' అని న్యాయమూర్తి తీర్పు ప్రకటించే సమయంలో దీప కోర్టులోకి ఎంటర్ అవుతుంది. తనను తాను కార్తీక్ భార్యగా న్యాయమూర్తికి పరిచయం చేసుకుంటుంది. 'మీరు తీర్పు ఇచ్చే ముందు మరో ముఖ్యమైన సాక్షిని అనుమతించండి' అని కోరుతుంది. అందుకు, జడ్జ్ సరేనని అంటారు. కోర్టులోకి వస్తున్నది ఎవరనేది చూపించలేదు. కానీ, అందరూ షాక్ అవ్వడం, అంతకు ముందు దీప గన్ తీసుకుని మోనితకు గురి పెట్టడం గుర్తు చేసుకుంటే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది.
Also Read