వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు.. సోనూసూద్ ను అందుకే టార్గెట్ చేశారా?
on Sep 17, 2021
ప్రముఖ నటుడు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం మొదలైన సోదాలు మూడోరోజు కూడా కొనసాగుతున్నాయి. సోనూసూద్ భారీ మొత్తంలో పన్ను ఎగవేశాడని ఈ సోదాల్లో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సోనూసూద్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సోనూసూద్ భారీ మొత్తంలో పన్ను ఎగవేశాడని అధికారులు గుర్తించినట్లు సమాచారం. సినిమాల నుంచి వచ్చే పేమెంట్లతో పాటు ఆయన వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా, కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. అలాంటి సోనుసూద్ పై పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ దాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇటీవల ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆయనపై ఐటీ దాడులు చేయడంతో.. అధికార పార్టీపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.