వివాదంలో చిక్కుకున్న 'మెగా కోడలు'
on Jan 27, 2022
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే.. ఉపాసన కొణిదెల తాజాగా తన ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వివాదాస్పదం అయింది. ఉపాసన పెట్టిన పోస్టుపై ధార్మిక సంఘాలు, నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన కొణిదెల ఓ గుడి గోపురం ఫొటోను షేర్ చేశారు. అది ఓ కళాఖండం అంటూ ఉపాసన కామెంట్ పెట్టారు. ఉపాసన కళాఖండం అని చెబుతున్న ఫొటోలో దేవుళ్లు, దేవతల బొమ్మలకు బదులు సినీ తారలు, మనుషుల బొమ్మలు ఉన్నాయి. అవే ఇప్పుడు ఉపాసనను వివాదంలోకి లాగాయి.
పైగా ఈ కళాఖండానికి కాప్షన్ ఇవ్వండంటూ కూడా ఉపాసన కొణిదెల పోస్టు చేయడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు సంధిస్తున్నారు. 'ఎలాంటి అడ్డంకులూ లేని, మరింత సహనశీలమైన దేశాన్ని అందరం కలిసి నిర్మిద్దాం' అంటూ ఆ ఫోటోతో పాటు ఉపాసన పోస్టు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ కళాఖండంలో ఉన్న తాను, తన భర్త రామ్ చరణ్ ఫొటోలను గుర్తుపట్టండి అంటూ ఓ ఫజిల్ కూడా జనం మీదకు వదిలారు. ఆ కళాఖండాన్ని శోభా కామినేని తనకు ఇచ్చారని, దాన్ని తాను బాగా ఇష్టపడుతున్నానని కూడా పేర్కొన్నారు. ఇంత చక్కని కళాఖండాన్ని సృష్టించిన ఆ కళాకారుడికి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఉపాసన కొణిదెల కితాబు ఇచ్చారు.
దేవుళ్లు ఉండాల్సిన గోపురంపై మనుషులు ఉన్నట్లుగా ఫొటో తయారుచేయడం ఏంటని నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉపాసన తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఫొటో, వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
Also Read