ఆన్లైన్ టికెట్ విధానం కావాలని ప్రభుత్వాన్ని కోరింది మేమే: టాలీవుడ్ నిర్మాతలు
on Sep 20, 2021
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సోమవారం టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే అమలయ్యేలా ఆన్లైన్ టికెట్ వ్యవస్థను తీసుకొస్తామని పేర్ని నాని అన్నారు.
మంత్రి పేర్ని నానితో సమావేశం అనంతరం నిర్మాత సీ. కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆన్లైన్ టికెట్ విధానం కావాలని తామే అడిగామని చెప్పుకొచ్చారు. ఇంకో నిర్మాత ఆదిశేషగిరిరావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆన్లైన్ టికెట్ విధానం కావాలని తామే కోరామని.. దీని వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రితో చర్చించామని.. ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని ఆదిశేషగిరిరావు వెల్లడించారు. మరో నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్స్ విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని తెలిపారు. బుక్ మై షో వంటి సైట్స్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారని అన్నారు.
కాగా ఆన్లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటీవల విమర్శలు వ్యక్తమయ్యాయి. దేవ కట్టా వంటి దర్శకులు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ టికెట్ విధానం కావాలని తామే అడిగామని సినీ నిర్మాతలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.