రెండు పడవల ప్రయాణం చేస్తోన్న శంకర్!
on Feb 9, 2023
ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ప్రాణాలకే ముప్పు. ఇలా ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకవైపు ఆర్సి15, మరోవైపు ఇండియన్ 2 చిత్రాలతో ఆయన టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా రాజమౌళి తరహాలోనే శంకర్ కూడా తాననుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు రాజీ పడర. దాని కోసం 100కి 200శాతం ఎఫర్ట్ పెడతారు. ఒక చిత్రం షూటింగ్ జరుగుతుంటే మరో చిత్రం గురించి కనీసం ఆలోచన కూడా చేయరు. ఒక చిత్రం పూర్తయిన తర్వాత మరలా తర్వాతి చిత్రం కోసం దృష్టి పెడతారు.
1996లో కమల్ హీరోగా వచ్చిన భారతీయుడుకు సీక్వెల్ గా ఇండియన్ 2చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారతీయుడు చిత్రం హిందీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను నాడే కొల్లగొట్టింది. దాంతో ఇండియన్ 2 చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. షూటింగ్ స్పాట్లో ప్రమాదం జరిగింది. క్రేన్ యాక్సిడెంట్ కావడంతో ముగ్గురు సిబ్బంది చనిపోవడం ఆయన్ని కలచి వేసింది. అంతలోనే లైకా సంస్థ వారికి ఆయనకు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఇండియన్ 2 ను కొంతకాలం ఆపేశారు. ఈ సమయంలో ఆయన ఆర్సి15 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆర్సీ 15 చిత్రం ఓకే చేసే సమయంలో ఇండియన్ 2 చిత్రం మరలా చేయాల్సి వస్తుందని, అది కూడా ఆర్సీ 15 షూటింగ్ సమయంలోనే దానిని కూడా తీయాల్సి వస్తుందని ఊహించలేదు. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా శంకర్ ఆర్సీ15 చిత్రం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ జె సూర్య, జయరాం, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే రాజమండ్రి, హైదరాబాద్, అమృతసర్ లలో జరిపారు. అయితే ఎప్పుడైతే ఇండియన్ 2 తెరపైకి వచ్చిందో అప్పటినుంచి ఆర్సి15కి కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రం ప్రకటించి రెండేళ్లవుతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఈ రెండు చిత్రాల వల్ల శంకర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ప్రస్తుతం ఇండియన్2 షూటింగ్ ఏపీలోని గండికోటలో జరుగుతోంది. ఇటీవల కొంతకాలం తిరుపతిలో షూటింగ్ చేశారు. ఇలా ఒకేసారి రెండు చిత్రాలు అనే తన మనసుకు నచ్చని పనిని శంకర్ మనసు చంపుకుని చేస్తున్నట్లు సమాచారం. తాజాగా చేస్తోన్న ఇండియన్ 2 తాజా షెడ్యూల్ పూర్తయితే గానీ ఆర్సి15 కొత్త షెడ్యూల్ను మొదలు పెట్టడం వీలు కాదు. దిల్ రాజుకు ఈ మూవీ ఆలస్యం అవ్వడం వల్ల భారీగా వడ్డీలు పెరిగిపోతున్నాయట. దాంతో దిర్రాజు శిరీష్లు టెన్షన్ పడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ ని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా కొత్త దర్శకులతో ఉండే కంఫర్టబులిటీ గాని, తను పరిచయం చేసి అగ్ర దర్శకులుగా మారిన వారితో చేసినప్పుడు ఉండే సహకారం వంటివి శంకర్ వంటి దర్శకుడితో ఉండవని దిల్ రాజుకి ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది.
శంకర్ వంటి దర్శకుని చేతికి సినిమా వెళ్లిన తర్వాత ఆయన చెప్పినట్టు నిర్మాత నడుచుకోవాల్సిందే గాని దిల్ రాజు చెప్పినట్లు శంకర్ వినరు. ఒక్క శంకర్ మాత్రమే కాదు... రాజమౌళి సహా ఏ అగ్ర దర్శకుడైనా ఇదే పరిస్థితి. కానీ ఇంతకాలం దిల్ రాజు చేసిన చిత్రాలు ఒక ఎత్తు. శంకర్ చిత్రం మరో ఎత్తు. ఇంతకాలం సొంతంగా తానే దర్శకులను పరిచయం చేశారు. తాను పరిచయం చేసి దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారితో పెద్ద చిత్రాలు చేశారు. కానీ ఆయన ఇప్పటివరకు లెజెండ్ అని పేరొందిన దర్శకులతో చిత్రాలు చేయలేదు. కానీ శంకర్ వంటి దర్శకునితో ఆయన చిత్రం చేయడం ఇదే తొలిసారి. దాంతో ఆయనకు ఈ సినిమా పెద్ద టెన్షన్ గా మారింది. దిల్ రాజు శిరీష్ లు ఈ చిత్రం విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నారట. మొత్తానికి శంకర్ ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన ఈ రెండు చిత్రాల మేకింగ్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందా లేక ఆయన ఈ టెన్షన్లని పక్కనపెట్టి సినిమాల విషయమే ఆలోచిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకు ఒత్తిడితో ఏమాత్రం ఇబ్బంది పడ్డ అది శంకర్ తీసే సినిమాల క్వాలిటీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.