చరణ్ - శంకర్ సినిమాకి హైలైట్గా ట్రైన్ ఎపిసోడ్?
on Sep 21, 2021
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటేనే విజువల్ ఫీస్ట్ కి కేరాఫ్ అడ్రస్. `జెంటిల్ మేన్` (1993) నుంచి `2.0` (2018) వరకు తనది ఇదే శైలి. అంతేకాదు.. తన సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా ట్రైన్ ఎపిసోడ్స్ కి చోటిస్తుంటారాయన. `జెంటిల్ మేన్`, `అపరిచితుడు`, `రోబో` తదితర చిత్రాల్లో ఈ తరహా సన్నివేశాలను గమనించవచ్చు. ఇక `జెంటిల్ మేన్`లో అయితే ఏకంగా `చికుబుకు చికుబుకు రైలే` అంటూ ఓ ట్రైన్ సాంగ్ నే డిజైన్ చేశారు శంకర్.
ఇదిలా ఉంటే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న కొత్త చిత్రంలోనూ ఓ అదిరిపోయే ట్రైన్ ఎపిసోడ్ కి స్థానమిచ్చారట శంకర్. వందలాది మంది ఫైటర్స్ కాంబినేషన్ లో చరణ్ చేసే ఈ పోరాట ఘట్టం సినిమాకి ఓ ప్రధాన ఆకర్షణ కానుందని బజ్. అంతేకాదు.. ప్రత్యేకంగా వేసిన సెట్ లో తీయబోయే ఈ సన్నివేశానికి ఏకంగా రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వాని నటిస్తుండగా.. అంజలి, సునీల్, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.