'మా' సభ్యులు తమ సమాధుల్ని తామే తవ్వుకుంటున్నారు.. నాగబాబు లేఖ కలకలం!!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫ్యూచర్ తలచుకుంటే భయమేస్తోందనీ, మా సభ్యులు తమ సమాధుల్ని తామే తవ్వుకుంటున్నారనీ తీవ్ర ఆరోపణలు చేశారు నటుడు నాగబాబు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి, ప్రకాశ్రాజ్ ఓడిపోవడాన్ని ప్రాంతీయవాదం, సంకుచితవాదం గెలుపుగా అభివర్ణించిన ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక బహిరంగ లేఖను షేర్ చేశారు.
"నేనెప్పుడూ స్పష్టమైన, పక్షపాతంలేని స్వభావాన్ని ఆరాధిస్తాను. అనేక సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల్ని మా అసోసియేషన్ తరపున స్వాగిస్తూ వచ్చాం. వాళ్ల ఇంటి నుంచి సుదూరంగా ఉండే 'MAA' అని పిలిచే కొత్త ఇంటిని వాళ్లకు అందించి, మాలోని వాళ్లుగా వాళ్లను సొంతం చేసుకుంటూ వచ్చాం. గతంలో గౌరవప్రదమైన మా ప్రెసిడెంట్ పదవి కోసం నేను పోటీచేయడానికి ప్రధాన, ప్రముఖ కారణాల్లో ఇదొకటి." అని ఆయన ఆ లేఖలో తెలిపారు.
కానీ తాను ఆశ్చర్యపోయే రీతిలో కళాకారులుగా, మనుషులుగా అసోసియేషన్ సభ్యుల్లో తీవ్రమైన, అసహ్యకరమైన మార్పు వచ్చిందని ఆయన అన్నారు. "మన అసోసియేషన్ భుజబలం, ధనబలం ప్రభావం కింద ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వాల శక్తుల ద్వారా నడుపబడుతోందనీ, ఈ ఎన్నికలు పక్షపాతంగా, వివక్షతో జరిగాయనీ నాలాంటి చాలామందికి అర్థమైంది. మన అసోసియేషన్ మెంబర్స్ ఒక కొత్త అస్తవ్యస్త స్థితిలోకి తమంతట తాము వెళ్లిపోయారు." అని ఆయన రాసుకొచ్చారు.
స్టీరియో టైప్స్, హిపోక్రైట్స్, డిస్మల్ జిమ్మీస్తో ఉన్న ఈ అసోసియేషన్ నుంచి బయటకు వచ్చే సమయం ఇదేనని గ్రహించానని చెప్పిన నాగబాబు, "ప్రాంతం, మతం ఆధారంగా తమ సమాధుల్ని తామే తవ్వుకుంటున్న వాళ్లు ఉంటున్న ఈ అసోసియేషన్కు నేను గుడ్బై చెప్పడం అనివార్యం. ప్రకాశ్రాజ్ లాంటి గౌరవప్రదమైన, ఏ కారణం కోసమైనా భయపడకుండా పోరాడే, తిరుగులేని సంకల్పంతో ఉండే మనుషుల వైపు నేనెప్పుడూ ఉంటాను." అని స్పష్టం చేశారు.
"గత పరిస్థితులకు నేను రిగ్రెట్ అవను కానీ ఈ అసోసియేషన్ ఫ్యూచర్ గురించి భయపడుతున్నాను. జాగ్రత్తపడండి.." అని హెచ్చరించారు నాగబాబు.
Also Read