మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన గోపీ సుందర్!
on Oct 21, 2021
మెలోడీ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగీత దర్శకుల్లో గోపీ సుందర్ ఒకరు. కేరళకు చెందిన ఈ 44 ఏళ్ళ స్వరకర్త.. 2015లో విడుదలైన `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`తో టాలీవుడ్ లో తొలి అడుగేశాడు. ఆపై `భలే భలే మగాడివోయ్`, `ఊపిరి`, `మజ్ను`, `ప్రేమమ్`, `నిన్ను కోరి`, `గీత గోవిందం`, `మజిలీ` చిత్రాలతో అలరించాడు. ఈ సినిమాలన్నీ కూడా గోపీ సుందర్ ని తెలుగునాట సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మలిచాయి.
అయితే, `మజిలీ` తరువాత మాత్రం గోపి పూర్తిగా ట్రాక్ తప్పాడు. `ఎంత మంచివాడవురా`, `చూసీ చూడంగానే`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `నిశ్శబ్దం`, `టక్ జగదీష్` (నేపథ్య సంగీతం).. ఇలా గోపీసుందర్ సంగీత సారథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. విజయదశమి కానుకగా విడుదలైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు ఈ టాలెంటెడ్ కంపోజర్. అంతేకాదు.. తన బాణీలతో సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ప్రస్తుతం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందుతున్న `18 పేజెస్`కి స్వరాలందిస్తున్నాడు గోపి. మరి.. ఈ సినిమాతో గోపి విజయ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.