మెగాస్టార్ తోనే మొదలెడుతున్న మైత్రీ!
on Jun 27, 2022
అనతికాలంలోనే తెలుగునాట అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్. `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం`తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న మైత్రీ.. రీసెంట్ టైమ్స్ లో `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్`, `సర్కారు వారి పాట`తోనూ మరో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంది. అలాగే.. ఈ రెండు హ్యాట్రిక్స్ నడుమ `చిత్రలహరి`, `మత్తు వదలరా` వంటి విజయాలతో పాటు `సవ్యసాచి`, `అమర్ అక్బర్ ఆంటోని`, `డియర్ కామ్రేడ్`, `గ్యాంగ్ లీడర్` వంటి ఫ్లాప్స్ ని సైతం మూటగట్టుకుంది. ఇక రీసెంట్ గా రిలీజైన `అంటే.. సుందరానికీ!` సైతం బోల్తా పడింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అరడజను చిత్రాలతో ఈ నిర్మాణ సంస్థ బిజీగా ఉంది. వాటిలో మెగాస్టార్ చిరంజీవితో నిర్మిస్తున్న `మెగా 154` ఒకటి. బాబీ రూపొందిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఈ సినిమాని 2023 సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పొంగల్ సీజన్ లో మైత్రీ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే. మరి.. మెగాస్టార్ కాంబినేషన్ లోనే మొదటిసారిగా సంక్రాంతి బరిలోకి దిగుతున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఫస్ట్ పొంగల్ రిలీజ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.