సాయితేజ్ హెల్త్ అప్డేట్.. వెంటిలేటర్ను తొలగించనున్న డాక్టర్లు!
on Sep 14, 2021
బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లిన హీరో సాయిధరమ్ తేజ్ పరిస్థితి క్రమంగా మెరుగువుతోంది. చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 10 వినాయక చవితి పండుగ రోజు రాత్రి రాయదుర్గం దగ్గర బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయిన సాయితేజ్ను మొదట అక్కడి సమీపంలోని మెడికవర్ హాస్పిటల్కు, ఆ తర్వాత జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కు తరలించారు.
పరీక్షల్లో ఆయన క్లావికల్ (కాలర్) బోన్ విరిగినట్లు గుర్తించారు. నిన్న దానికి చేసిన సర్జరీ విజయవంతం అయింది. అయితే ఇప్పటికీ సాయితేజ్ను ఐసీయూలోనే ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూనే ఉన్నారు. అలా ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే వెంటిలేటర్ను తొలగించి, ప్రత్యామ్నాయ విధానాల్లో సాయితేజ్కు చికిత్స అందించాలని డాక్టర్లు భావిస్తున్నారు. ఇదే విషయమై చిరంజీవి, పవన్ కల్యాణ్, సాయితేజ్ ఫ్యామిలీతో కలిసి వారు చర్చించారు.
మేనల్లుడి కోసం 'భీమ్లా నాయక్' షూటింగ్కు పవన్ కల్యాణ్ విరామం ఇచ్చారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్య స్థితి గురించి ఆరా తీస్తూ, డాక్టర్లతో టచ్లో ఉంటున్నారు. అందిన సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ సాయితేజ్కు అందిస్తున్న కృత్రిమ శ్వాసను తొలగించవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు ఛాతీపై బాగా ఒత్తిడి తగలడం వల్ల ఇప్పటికీ సాయితేజ్ సౌకర్యంగా శ్వాస తీసుకోలేకపోతున్నాడని తెలుస్తోంది. అందుకే నాలుగు రోజులైనా వెంటిలేటర్ను తొలగించలేదు.