`జై లవ కుశ`గా త్రిపాత్రల్లో తారక్ అలరించి నేటికి నాలుగేళ్ళు!
on Sep 21, 2021
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినయ పర్వంలో బాగా గుర్తుండిపోయే పాత్రల్లో `జై` ఒకటి. `జై లవ కుశ` చిత్రం కోసం పోషించిన ఈ పాత్ర.. తారక్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రంగానూ.. అలాగే తారక్ త్రిపాత్రాభినయం చేసిన మొదటి సినిమాగానూ `జై లవ కుశ` ప్రత్యేక స్థానం దక్కించుకుంది. పేరుకి ముగ్గురు అన్నదమ్ముల కథే అయినా.. సొంత వాళ్ళే చులకనగా చూడడంతో సమాజంపై కసితో పెరిగిన `జై` పాత్రే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రావణాసురుడి పాత్ర స్ఫూర్తితో రూపొందిన ఈ `జై` క్యారెక్టర్ ని తారక్ పండించిన తీరు జనాల జేజేలు అందుకుంది.
రాశీ ఖన్నా, నివేదా థామస్ నాయికలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రత్యేక గీతంలో తళుక్కున మెరవగా.. రోనిత్ రాయ్, పోసాని కృష్ణమురళి, పవిత్రా లోకేశ్, సాయికుమార్, ప్రదీప్ రావత్, నాజర్, అభిమన్యు సింగ్, హరీశ్ ఉత్తమన్, హంసా నందిని, నందితా రాజ్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో ``రావణా``, ``స్వింగ్ జరా``, ``నీ కళ్ళలోన`` విశేషాదరణ పొందాయి. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఛోటా కె. నాయుడు అందించిన ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2017 సెప్టెంబర్ 21న విడుదలైన `జై లవ కుశ`.. నేటితో నాలుగు వసంతాలను పూర్తిచేసుకుంది.