![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్ కి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించిన చిత్రం `యజ్ఞం`(2004). 2001లో విడుదలైన `తొలివలపు`తో హీరోగా పరిచయమైన గోపి.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో విలన్ గా టర్న్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. `జయం`(2002), `నిజం`(2003), `వర్షం`(2004) చిత్రాలతో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపుని పొందాడు. ఆ సినిమాలు తెచ్చిన ఇమేజ్ తో మళ్ళీ `యజ్ఞం`తో హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన గోపీచంద్ కి.. కథానాయకుడిగా చేసిన రెండో ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత మరిన్ని విజయాలతో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
అలా.. గోపీచంద్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన `యజ్ఞం` చిత్రం 2004లో ఇదే జూలై 2న జనం ముందుకొచ్చింది. అప్పటి ట్రెండ్ కి తగ్గట్టే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఫ్యాక్షనిస్ట్ రెడ్డప్ప (దేవరాజ్) దగ్గర అనుచరుడిగా పనిచేసే శీను (గోపీచంద్).. రెడ్డప్ప కూతురు శైలజ (సమీరా) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. పెద్దయ్యాక ప్రేమలో పడ్డ శీను, శైలుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే పాయింట్ తో `యజ్ఞం` తెరకెక్కింది.
`యజ్ఞం`లో గోపీచంద్ కి జంటగా సమీరా భరద్వాజ్ నటించగా.. దేవరాజ్, ప్రకాశ్ రాజ్, విజయరంగరాజు, సుమన్ శెట్టి, రఘుబాబు, ఝాన్సీ, జాహ్నవి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతంలో రూపొందిన ``చిన్ననాటి చెలికాడే``, ``తొంగి తొంగి``, ``ఏం చేశావో నా మనసు`` పాటలు అప్పట్లో సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈతరం ఫిల్మ్స్ సంస్థ అధినేత పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్, ఒరియా భాషల్లో రీమేక్ అయిన `యజ్ఞం`.. నేటితో 17 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |