![]() |
![]() |

ఎన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ లో వర్షం పడితే రోడ్లు నదుల్లా మారిపోవడం, ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడం కామన్ అయిపొయింది. దీంతో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో వినతి పత్రం ఇచ్చాడు. అలాగే సినీ పరిశ్రమని, కళాకారులని పట్టించుకోవాలని కోరాడు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం తరపున సినిమా వారికి అవార్డులు ఇవ్వడం లేదు. దీనిని కూడా కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

"వర్షాల తరువాత నిండే రోడ్లను మరియు పొంగే నాళాల సమస్యను మీ టర్మ్ లో వీలైనంత తొందరగా పరిష్కరించగలరు. ప్రజాప్రతినిధుల కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్టుగానే అంబులెన్సులకు కూడా క్లియర్ చేయిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడిన వారువుతారు. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద పసి పిల్లలతో బిక్షాటన చేయించే వారిని కఠినంగా శిక్షించగలరు. ప్రతి కూడలి వద్ద పరిశుభ్రమైన నీటి వసతిని ఏర్పాటు చెయ్యగలరు. అలాగే పరిశుభ్రమైన టాయ్లెట్లని కట్టించగలరు. రోడ్ల మీద బాగా దూరం వెళ్లి తీసుకునే యూ-టర్న్ ల యొక్క దూరాన్ని తగ్గించగలరు. పార్కింగ్ చోట్లను పెంచగలరు." అంటూ హైదరాబాద్ వాసి పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరాడు.

ఇక సినిమా అంశాలపై స్పందిస్తూ.. "తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డులను మరియు ఫిల్మ్ ఫెస్టివల్స్ ని మొదలు పెట్టగలరు. ప్రత్యేకమైన ఫిల్మ్ స్కూల్ ని ప్రారంభించగలరు. కళాకారులూ, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్ మరియు మణికొండ ప్రాంతాల దగ్గర్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఆడిటోరియాలు కట్టించగలరు. తెలంగాణ సినిమాలకు, చిన్న సినిమాలకు, పిల్లల సినిమాలకు ప్రభుత్వ సబ్సిడి మరియు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వగలరు. అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మరియు పాత్రికేయులకు మీ పద్ధతుల ప్రకారం ఇళ్ళు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంసృతిక వారసత్వానికి మరియు చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరు." అంటూ సినిమా వ్యక్తి పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరాడు. మరి దర్శకుడు సంజీవ్ రెడ్డి వినతి పత్రం ప్రభుత్వం దృష్టికి వెళ్లి.. ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి.
కాగా దర్శకుడు సంజీవ్ రెడ్డి 'ఏబీసీడీ' అనే సినిమాతో పాటు 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్ చేశాడు.
![]() |
![]() |