![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ 9న జరగనున్న 'అంటే సుందరానికీ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ రానున్నాడు. అయితే ఈ వేడుకలో పవన్ ఏం మాట్లాడతాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత ఏడాది 'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. సినిమా టికెట్ ధరల అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ స్పీచ్ 'టాలీవుడ్ వర్సెస్ జగన్ సర్కార్' వార్ కి దారి తీస్తుందేమో అనుకున్నారంతా. కానీ టాలీవుడ్ నుంచి పవన్ కి అంతగా మద్దతు రాలేదు. పైగా ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందన్న భయంతో సినీ పెద్దలు కాళ్ళ బేరానికి వచ్చారు. అయితే నాని మాత్రం నేరుగా పవన్ స్టైల్ లో టికెట్ ధరల అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. దీంతో వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు గుప్పించినట్లుగానే నానిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు పవన్, నాని ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు.

ఏపీలో టికెట్ ధరల అంశంపై పవన్ తర్వాత అంత బలంగా వాయిస్ వినిపించిన హీరో నానినే. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ నానికి మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు నాని సినిమా వేడుకకు పవన్ వస్తుండటం ఆసక్తికరంగా మారింది. 'రిపబ్లిక్' సినిమా వేడుకలో సినీ పరిశ్రమ జోలికి రావద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పవన్.. ఈసారి కూడా అలాంటి సంచలనాలకు తెరదీస్తారేమో చూడాలి.
![]() |
![]() |