పిరియడ్ యాక్షన్ డ్రామాలో సూర్య.. రెండు భాగాలుగా ప్లాన్!?
on May 24, 2022
వైవిధ్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. కోలీవుడ్ స్టార్ సూర్య. ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలు చేసే సూర్య.. ఇటీవల `ఆకాశం నీ హద్దురా!`, `జై భీమ్` చిత్రాలతో విశేషంగా అలరించారు. కాగా, త్వరలో ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఓ పిరియడ్ యాక్షన్ డ్రామాలో సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. తన తమ్ముడు కార్తితో `సిరుత్తై` వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన `శౌర్యం` శివ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నారు. జూలై నుంచి పట్టాలెక్కే ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. పిరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే, సూర్య అతిథి పాత్రల్లో నటించిన `విక్రమ్`, `రాకెట్రీః ద నంబి ఎపెక్ట్` చిత్రాలు జూన్ 3న, జూలై 1న వరుసగా విడుదల కానున్నాయి. మరోవైపు.. `అసురన్` కెప్టెన్ వెట్రిమారన్ కాంబినేషన్ లో `వాడివాసల్` చేస్తున్నారు సూర్య. అదే విధంగా, తన కెరీర్ ని మేలిమలుపు తిప్పిన వెర్సటైల్ కెప్టెన్ బాల దర్శకత్వంలోనూ ఓ ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తున్నారు.
Also Read