బన్నీకి విలన్గా మనోజ్?
on Feb 14, 2021
దశాబ్దం క్రితం విడుదలైన మల్టిస్టారర్ మూవీ 'వేదం'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ కలిసి నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. ఇద్దరికీ నటులుగా ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. మరోసారి బన్నీ, మంచు మనోజ్ జట్టుకట్టనున్నారని టాక్. కాకపోతే.. ఈ సారి బన్నీకి మనోజ్ ప్రతినాయకుడు కాబోతున్నాడని అంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. 'ఆర్య', 'ఆర్య2' తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో బన్నీ.. 'పుష్ప' అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని విలన్ రోల్ కోసం తొలుత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. అయితే కాల్షీట్ల సమస్య కారణంగా విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో.. పలువురు ప్రముఖుల పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి. చివరికి ఆ అవకాశం మనోజ్ కి దక్కిందని టాక్.
అదే గనుక నిజమైతే.. మనోజ్ కి నటుడిగా ఇదో సువర్ణావకాశమే అనే చెప్పాలి. త్వరలోనే 'పుష్ప'లో మనోజ్ నటిస్తున్నాడో లేదో అన్న విషయంపై క్లారిటీ వస్తుంది.