ఆడియో రైట్స్ పరంగా 'సర్కారువారి పాట' సరికొత్త రికార్డు!
on Jul 31, 2021
సూపర్స్టార్ మహేశ్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని పరశురామ్ డైరెక్టర్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ స్కామ్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'సర్కారువారి పాట' ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫొటో, ప్రి-లుక్, టైటిల్ వీడియో కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దాని మ్యూజిక్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.
అత్యధిక ధర చెల్లించి సరిగమ కంపెనీ సర్కారువారి పాట పాటల హక్కులను పొందింది. ఏకంగా 4.5 కోట్లకు నిర్మాతలు ఆడియో హక్కుల్ని సరిగమ కంపెనీకి అమ్మారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి ఆడియో రైట్స్ ఈ స్థాయిలో ఇదివరకెన్నడూ అమ్ముడుపోలేదు. దాంతో దీన్నో రికార్డుగా చెప్పుకుంటున్నారు.
"సూపర్స్టార్ మహేశ్బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చార్ట్బస్టర్ కాంబో సర్కారువారి పాట ఆడియో హక్కుల్ని పేరుపొందిన ఆడియో లేబుల్ సరిగమ సౌత్ సొంతం చేసుకుంది." అని తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిర్మాతలు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 'సర్కారువారి పాట'లో మహేశ్బాబు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ బిగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది ట్రెండింగ్లో ఉంది.
ఒక బలమైన మెసేజ్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు.