బన్నీతో బోయపాటి పిరియడ్ డ్రామా?
on Sep 16, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన `సరైనోడు` (2016) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు బన్ని.
ఇదిలా ఉంటే.. బన్నీ - బోయపాటి కాంబోలో మరో చిత్రం రాబోతోందని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. అల్లు అర్జున్ హోమ్ బేనర్ గీతా ఆర్ట్స్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వినికిడి. వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న ఈ సినిమా.. పిరియడ్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. అలాగే, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మితం కానున్న ఈ మూవీలో బన్నీ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపిస్తారని బజ్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, బన్నీ ప్రస్తుతం `పుష్ప`తో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కానుంది. ఆపై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` చేయనున్నారు. ఇక బోయపాటి విషయానికి వస్తే.. ప్రస్తుతం తన లక్కీ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణతో `అఖండ` చేస్తున్నారు.