గుండెపోటుతో 24 ఏళ్ల పాపులర్ నటి మృతి
on Nov 21, 2022
పాపులర్ బెంగాలీ టీవీ తార ఐండ్రిలా శర్మ హౌరాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూసింది. ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలు. గుండెపోటుతో నవంబర్ 1న ఐండ్రిలా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆమె తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇదివరకు ఆమె బోన్-మారో కేన్సర్తో బాధపడింది. 2015లో ఆమెకు ఆ కేన్సర్ ఉన్నట్లు తెలిసింది.
'ఝుముర్' అనే సీరియల్తో ఆమె బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత 'జిబోన్ జ్యోతి', 'జియో కత్తి' అనే సీరియల్స్లో నటించింది. కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేసింది. నవంబర్ 1న విషమ స్థితిలో ఐండ్రిలా శర్మ అడ్మిట్ అయ్యిందనీ, అప్పటి నుంచీ వెంటిలేటర్ సపోర్ట్తో ఆమెకు చికిత్స అందిస్తూ వచ్చామనీ ఓ ప్రకటనలో హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చింది. శనివారం ఆమె ఆరోగ్య స్థితి క్షీణించగా, చివరకు ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచింది. ఐండ్రిలా మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.