కొవిడ్ రిలీఫ్ కోసం ఫండ్రైజర్ స్టార్ట్ చేసిన అనుష్క-విరాట్
on May 7, 2021
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, ఆమె క్రికెటర్ హజ్బెండ్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. ఇండియాలో కొవిడ్-19 రిలీఫ్ కోసం నిధులను సమీకరించడానికి ఆ జంట ఓ ఫండ్రైజర్ను స్టార్ట్ చేసింది.
ఆ వీడియోను షేర్ చేస్తూ, "మనదేశం కొవిడ్-19 సెకండ్ వేవ్తో పోరాడుతోంది. మన ఆరోగ్య వ్యవస్థలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొవిడ్తో జనం పడుతున్న బాధలు చూస్తుంటే నా హృదయం బద్దలవుతోంది. అందువల్ల, కెట్టోతో కలిసి, కొవిడ్-19 రిలీజ్ కోసం నిధులను సమీకరించడానికి #InThisTogether అనే ప్రచారాన్ని విరాట్, నేను ప్రారంభించాం. మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. భారత్కూ, భారతీయులకూ సపోర్ట్గా దయచేసి ముందుకు రండి. ఈ క్లిష్ట కాలంలో ప్రాణాలను రక్షించడానికి మీ కంట్రిబ్యూషన్ సాయపడుతుంది." అంటూ రాసుకొచ్చింది అనుష్క.
రూ. 7 కోట్లను సమీకరించాలనేది ఆ జంట పెట్టుకున్న లక్ష్యం. వాళ్లు కూడా దీని కోసం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అనుష్క-విరాట్ కాకుండా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఇండియా కోసం గత వారం ఓ ఫండ్రైజర్ను ప్రారంభించారు. ఇప్పటి దాకా వారు రూ. 6.6 కోట్లను సమీకరించారు.
ప్రాణాంతక మహమ్మారి సెకండ్ వేవ్తో పోరాడుతున్న దేశానికి తమ వంతు సాయం చేయడానికి అలియా భట్, దీపికా పడుకోనే, తాప్సీ పన్ను, సోను సూద్ లాంటి నటులు కృషి చేస్తున్నారు.