English | Telugu
మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన జానీ మాస్టర్
Updated : May 2, 2025
పహాల్గమ్ బాధితులైన మధుసూదన్ కుటుంబ సభ్యులను ఈరోజు ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ కుటుంబసభ్యులు వెళ్లి కలిశారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు తాను కూడా ఒక సోదరుడిలా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ఈ దేశ ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని టెర్రరిస్టు మూకలు ఎప్పటికీ ఏమీ చేయలేవు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. మన దేశంపై, మన ప్రజలపై జరిగే దాడులని కుల,మత,జాతి తేడాలు లేకుండా, అవసరమైతే ప్రతీ పౌరుడు ఒక సైనికుడిగా మారి ఎదుర్కోవాలి అంటూ పిలుపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఆ కుటుంబానికి 50 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నందుకు తమ తరపున ధన్యవాదాలు చెప్పమన్నారంటూ చెప్పారు జానీ మాష్టర్. చేసింది సాయం కాదు బాధ్యతను గుర్తించి వాళ్లకు అండగా నిలబడడం వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఏప్రిల్ 22 న పహాల్గమ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఐతే అదే ప్రాంతానికి బెంగుళూరు నివాసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ తన భార్య కామాక్షితో పాటు ఇద్దరు పిల్లలను తీసుకుని కాశ్మీర్ వెళ్ళాడు. మధుసూదన్ కావాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఐనా బెంగళూరులో స్థిరపడ్డాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ కావాలి వెళ్లి అక్కడ మధుసూదన్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పహాల్గమ్ బాధిత కుటుంబాలను ఆదుకున్న పవన్ కళ్యాణ్ కి జానీ మాష్టర్ కృతఙ్ఞతలు చెప్పారు.
