English | Telugu
మీ చూపులో లోపం ఉంది.. స్పందించిన శ్రావణ భార్గవి
Updated : Jul 20, 2022
శ్రావణ భార్గవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్తతో విడాకుల వదంతుల వ్యవహారం ఇలా సద్దుమణిగిందో లేదో, ఇప్పుడో మరో అంశంతో ఆమె మళ్ళీ తెరపైకి వచ్చి వార్తలకెక్కింది. తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన ఒక కీర్తన తన అందాన్ని వర్ణించేలా వాడుకున్నారంటూ అన్నమాచార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి వారి అభిషేకం సమయంలో ఆయన్ని కీర్తించేందుకు రాసిన అన్నమాచార్య కీర్తన "ఒకపరి వయ్యారమే" అనే దానికి చక్కగా అభినయిస్తూ ఉన్న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది శ్రావణ భార్గవి. ఇప్పుడు ఆ వీడియో పెద్ద వైరల్ అయ్యి వార్తలకెక్కింది.
ఈ విషయం అన్నమయ్య కుటుంబ సభ్యుల వరకు వెళ్లేసరికి వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కీర్తనకు శ్రావణభార్గవి తనదైన శైలిలో కాళ్ళు చూపిస్తూ, బ్యాక్ వ్యూలో డీప్ బ్లౌజ్ వేసుకుని వీపు చూపిస్తూ పలు భంగిమల్లో వీడియో చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ కీర్తనకు సంబంధించిన వీడియోను తొలగించాలని కొంతమంది అడిగేసరికి భార్గవి తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. "మీకు దృష్టిలోపం ఉంటే నేనేం చేయలేను. భక్తి భావంతో చూస్తే అమ్మవారే కనిపిస్తారు. కానీ మీ చూపులో లోపం ఉంది. నిండుగా దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా చూపు సరిగా లేకపోతే అశ్లీలంగానే కనిపిస్తుంది." అని ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. "ఈ వీడియోలో అభ్యంతరకంగా ఉన్నది ఏదీ లేదు" అని చెప్పింది శ్రావణభార్గవి.