English | Telugu
'విరూపాక్ష'కి అదిరిపోయే ఓపెనింగ్స్.. కానీ 'విన్నర్' కంటే తక్కువే!
Updated : Apr 22, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమా ఏప్రిల్ 21 న విడుదలైంది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. మొదటిరోజు కలెక్షన్లు పరంగా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.5.65 కోట్ల షేర్ తో 'విన్నర్' టాప్ లో ఉండగా.. ఇప్పుడు రూ.4.79 కోట్ల షేర్ తో విరూపాక్ష సత్తా చాటింది. సాయి ధరమ్ తేజ్ నటించిన గత మూడు నాలుగు చిత్రాలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అవి 2-3 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా.. విరూపాక్ష దాదాపు డబుల్ షేర్ రాబట్టడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు నైజాంలో రూ.1.82 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.54 లక్షలషేర్, ఆంధ్రాలో రూ.2.43 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.4.79 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.36 లక్షలషేర్, ఓవర్సీస్ లో రూ.1.20 కోట్ల షేర్ కలిపి.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.6.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా రూ.22.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా మొదటిరోజు 28 శాతానికి పైగా రికవర్ చేసింది. సినిమాకి హిట్ టాక్ రావడంతో పాటు ప్రస్తుతం ఇతర సినిమాల పోటీ లేకపోవడం, వేసవి సెలవులు కావడం వంటి అంశాలు కలిసొచ్చి తొలి వారంలోనే ఈ చిత్రం లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశముంది.
