English | Telugu
విజయ్ దేవరకొండ ఎవరి బినామీ..?
Updated : May 5, 2025
'పెళ్ళి చూపులు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో సోలో హీరోగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. 'పెళ్ళి చూపులు' తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో స్టార్ గా ఎదిగిన విజయ్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా 'పెళ్ళి చూపులు' తర్వాత 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. అలాగే, నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇలా సినీ పరిశ్రమలో ఈ ఇద్దరూ ఎవరికివారు తమ మార్క్ చూపిస్తున్నారు. అయితే వీరిద్దరూ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనుందట. ఈ సినిమాకి 'బినామీ' అనే టైటిల్ ని కూడా లాక్ చేసినట్లు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తే.. ఇందులో విజయ్ ఎవరికైనా బినామీగా కనిపిస్తాడేమో అనిపిస్తోంది.
గీతా ఆర్ట్స్ కి చెందిన జీఏ2 పిక్చర్స్ లో గతంలో విజయ్ 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రాలను చేశాడు. ముఖ్యంగా 'గీత గోవిందం' విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 'బినామీ'తో హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.
విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' చేస్తున్నాడు. ఇది మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత దర్శకులు రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత తరుణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 'పెళ్ళి చూపులు' సినిమా 2016 లో వచ్చింది. అంటే ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత విజయ్, తరుణ్.. రెండో సినిమా కోసం చేతులు కలుపుతున్నారన్నమాట.
