Read more!

English | Telugu

ఎన్నాళకెన్నాళ్ళకు గురుశిష్యులు కలిసారు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు!

కె.విజయభాస్కర్‌.. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన దర్శకుడు. ఇప్పటికీ టీవీల్లో సందడి చేసే స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ.. వంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన అప్లాజ్‌ రాలేదు. ఆయన చివరిగా తెరకెక్కించిన సినిమా 2013లో వచ్చిన ‘మసాల’. 

డైరెక్టర్‌గా చాలా గ్యాప్‌ తీసుకున్న విజయభాస్కర్‌ ఇప్పుడు ‘ఉషా పరిణయం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. తన కుమారుడు శ్రీకమల్‌ను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు విజయభాస్కర్‌. ‘ప్రార్థన’ చిత్రంతో దర్శకుడుగా మారిన విజయభాస్కర్‌కు ఆ సినిమా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత 1999లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆయనకు తోడయ్యాడు. ‘స్వయంవరం’తో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం ‘జై చిరంజీవ’ వరకు కొనసాగింది. పైన చెప్పుకున్న సినిమాల్లో ‘నువ్వే కావాలి’ తప్ప మిగతా సినిమాలన్నింటికీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ, మాటలు అందించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. 

చాలా కాలం తర్వాత కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు మెగా ఫోన్‌ పట్టిన విజయభాస్కర్‌కు విషెస్‌ చెప్పేందుకు ‘ఉషా పరిణయం’ సెట్‌కి వెళ్ళారు త్రివిక్రమ్‌. ఈ సినిమాలో శ్రీకమల్‌ సరసన తాన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకమల్‌కు హీరోగా బ్రేక్‌ ఇచ్చేందుకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు విజయభాస్కర్‌. త్రివిక్రమ్‌ సెట్‌కి వెళ్ళే సమయానికి సీరత్‌ కపూర్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్‌ విజయభాస్కర్‌కి బెస్ట్‌ విషెస్‌ చెప్పి యూనిట్‌ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. 

ఒకప్పుడు విజయభాస్కర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే పెద్ద క్రేజ్‌ ఉండేది. ఈ కాంబోలో సినిమా వస్తోందంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి, పంచ్‌ డైలాగ్స్‌కి లోటే ఉండదని ఆడియన్స్‌ నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే చక్కని కథ, కథనాలతోపాటు గిలిగింతలు పెట్టే డైలాగ్స్‌ రాసేవారు త్రివిక్రమ్‌. ఇప్పటికీ ఆ సినిమాలు ఆడియన్స్‌ని నవ్విస్తూనే ఉన్నాయి. ‘ఉషా పరిణయం’ సెట్‌లో సందడి చేసిన త్రివిక్రమ్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నాళకెన్నాళ్ళకు గురుశిష్యులు కలిసారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.