English | Telugu

హీరో పారితోషికం 70 కోట్లు.. ఇప్పుడదే శ్రీలీల కొంప ముంచింది.. ఎలాగంటే?

హీరో పారితోషికం 70 కోట్లు.. ఇప్పుడదే శ్రీలీల కొంప ముంచింది.. ఎలాగంటే?

తెలుగు సినిమా ‘చిత్రాంగద’తో బాలనటిగా తన కెరీర్‌ని ప్రారంభించిన శ్రీలీల.. ‘పెళ్లిసందడి’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన శ్రీలీల ఆ తర్వాత చేసిన సినిమాలతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది. ‘పుష్ప2’లో చేసిన ఐటమ్‌ సాంగ్‌తో యూత్‌లో మరింత క్రేజ్‌ సంపాదించుకొని టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనిపించుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ్‌లో, ‘ఆషికి3’తో హిందీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘పరాశక్తి’ సినిమా వల్ల శ్రీలీల తమిళ్‌ ఎంట్రీ కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అరడజను సినిమాలతో శ్రీలీల బిజీగా అయిపోయింది. ‘పరాశక్తి’ తనకు తమిళ్‌లో మంచి క్రేజ్‌ తెస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇప్పుడీ సినిమా సమస్యల్లో ఇరుక్కోవడంతో సినిమా రిలీజ్‌ అవుతుందా, లేదా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. 

వివరాల్లోకి వెళితే.. ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాల దర్శకురాలు సుధా కొంగర చేస్తున్న ‘పరాశక్తి’ టీజర్‌ ఆమధ్య విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అమరన్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో అతని ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అతని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘పరాశక్తి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అమరన్‌’ హిట్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకి శివకార్తికేయన్‌కు రూ.70 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమాను నిర్మిస్తున్న డాన్‌ పిక్చర్స్‌ అధినేతలు ఓ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఈడీ అధికారులు ఆ నిర్మాతలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రచారంలో ఉన్న వార్తలను బట్టి చూస్తే ‘పరాశక్తి’ నిర్మాతల ద్వారా పెద్ద స్కామ్‌ జరిగిందని సమాచారం. శివకార్తికేయన్‌కి మార్కెట్‌ కంటే ఎక్కువ పారితోషికం ముట్టజెప్పారని, అందులో బ్లాక్‌మనీ ఎక్కువ ఉందని తెలుస్తోంది. ఆ డబ్బుతో అతనికి ఓ ఖరీదైన భవనాన్ని నిర్మిస్తున్నారని తమిళ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. 

‘పరాశక్తి’ నిర్మాతలు ఈ స్కామ్‌లో ఇరుక్కోవడం, ఈడీ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడంతో అది శివకార్తికేయన్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమస్య పెద్దది కావడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని సమాచారం. ఇంత భారీ సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇవ్వాలని భావించిన శ్రీలీలకు పెద్ద షాక్‌ ఇచ్చారు ‘పరాశక్తి’ నిర్మాతలు. తమిళ మీడియా కథనాల మేరకు ఇప్పట్లో సినిమా తిరిగి షూటింగ్‌ జరుపుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు పలు కేసుల్లో ఇరుక్కోవడం, కోర్టుల చుట్టూ తిరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక భారీ చిత్రం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంది అంటే ఈ కేసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో, సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.