English | Telugu

‘కన్నప్ప’ టీమ్‌కి సారీ చెప్పిన మనోజ్‌.. ‘భైరవం’ దగ్గర పడుతోంది. అందుకేనా?

‘కన్నప్ప’ టీమ్‌కి సారీ చెప్పిన మనోజ్‌.. ‘భైరవం’ దగ్గర పడుతోంది. అందుకేనా?

మంచు మనోజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భైరవం’. ఈ సినిమా మే 30న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఇటీవల ఏలూరులో ఒక ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ గురించి మనోజ్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎందుకంటే మంచు ఫ్యామలీలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ల మధ్య జరిగిన రకరకాల గొడవలు, పోలీస్‌ కేసులు, కోర్టులు.. ఇలా కొంతకాలం నానా రభస జరిగింది. గత కొన్ని రోజులుగా ఇరు వర్గాలు సైలెంట్‌గానే ఉన్నాయి. తాజాగా మనోజ్‌ చేసిన వ్యాఖ్యల వల్ల మరోసారి వార్తల్లోకి వచ్చింది మంచు ఫ్యామిలీ. 

‘నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పరమ శివుడే డైరెక్టర్‌ విజయ్‌ రూపంలో వచ్చి భైరవం ఇచ్చాడు. శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు విష్ణు చెప్పిన శివయ్యా డైలాగ్‌ని ప్రస్తావించారు మనోజ్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మనోజ్‌ ఎట్టకేలకు స్పందించారు. ‘సినిమా అంటేనే టీమ్‌ వర్క్‌. ఏ ఒక్కరి వల్లో సినిమా పూర్తి కాదు. నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌ కూడా ఎంతో కష్టపడితేనే సినిమా తయారవుతుంది. ఒక్కరిని ఉద్దేశించి కామెంట్‌ చేయడం తప్పే. ఇండస్ట్రీలోనే ఉన్న వ్యక్తిగా నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఈ విషయంలో కన్నప్ప టీమ్‌కి క్షమాపణలు చెబుతున్నాను. నేను ఎమోషనల్‌గా ఆ కామెంట్స్‌ చేసాను తప్ప నాకు మరో ఉద్దేశం లేదు. ఏది ఏమైనా ‘కన్నప్ప’ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్‌గా చెప్పారు మంచు మనోజ్‌. 

మనోజ్‌ తాజాగా చెప్పిన ఈ మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఇప్పటివరకు కన్నప్ప గురించి, విష్ణు గురించి నెగెటివ్‌గానే మాట్లాడుతూ వచ్చిన మనోజ్‌ సడన్‌గా పాజిటివ్‌ టర్న్‌ తీసుకోవడం వెనుక ‘భైరవం’ ఉంది అంటున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సినిమాకి నష్టం జరుగుతుందని భావించి కన్నప్ప టీమ్‌కి క్షమాపణలు చెప్పాడు అంటున్నారు. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత మనోజ్‌ చేస్తున్న సినిమా కావడం, తన కెరీర్‌కి ఎంతో ముఖ్యమైన సినిమా కావడంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు అంటున్నారు.