Read more!

English | Telugu

సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌ కపూర్‌.. వైరల్‌ అవుతున్న స్టిల్స్‌.. ఇందులో నిజమెంత?

ఆనాటి లవకుశ నుంచి నిన్నటి ఆదిపురుష్‌ వరకు ఎప్పుడు రామాయణ గాధను తెరకెక్కించినా అందరూ ఆ సినిమాపై ఆసక్తిని కనబరుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు రామయణాన్ని సిల్వర్‌ స్క్రీన్‌ మీద, బుల్లితెరపై రకరకాలుగా ఆవిష్కరించారు. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌తో రామాయణ గాధను సినిమాగా రూపొందిస్తున్నారనగానే దేశమంతా అలర్ట్‌ అయిపోయింది. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరీలోనూ కనిపించింది. అయితే ఆ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో తెరకెక్కించడంలో దర్శకుడు ఔం రౌత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. 

ఇప్పుడు ఆ బాధ్యతను నితీష్‌ తివారి తీసుకున్నారు. రణబీర్‌ కపూర్‌, సాయిపల్లవిలతో మరోసారి రామాయణ ఇతివృత్తాన్ని తనదైన శైలిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరామ నవమి రోజునే ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తారని అంతా ఎదురుచూశారు. కానీ, అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఇప్పుడు సడన్‌గా శ్రీరాముడి గెటప్‌లో రణబీర్‌ కపూర్‌, సీత గెటప్‌లో సాయిపల్లవి కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఈ ఫోటోలు లీక్‌ అయ్యాయి అన్నట్టుగా ఉన్నాయి. ఈ ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీరాముడిగా రణబీర్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడని, సీతగా సాయిపల్లవి లుక్‌ కూడా చాలా బాగుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. ఇంత సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించారా.. అని అందరూ అనుమానంతో కూడిన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే నితిష్‌ తివారి ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో భారీ ఎత్తున తలపెట్టారు. దానికి కన్నడ స్టార్‌ హీరో యశ్‌ సహకారం కూడా ఉంది. ఈ సినిమాలో రావణ పాత్రను యశ్‌ పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇంత భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా షూటింగ్‌ స్టార్ట్‌ చేసేస్తారా అనే కామెంట్స్‌ కూడా మరోపక్క వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫోటోలు నిజమైనవి కావని, ఎవరో కావాలనే వాటిని క్రియేట్‌ చేసి అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు అంటున్నారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ స్టిల్స్‌ చూసిన తర్వాతైనా నితిష్‌ తివారి ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.