Read more!

English | Telugu

మనల్ని ఎవడ్రా ఆపేది.. మేలో అసలుసిసలు మాస్ జాతర!

కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా 'పుష్ప-2'(Pushpa 2: The Rule) మేనియానే కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1'.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో, 'పుష్ప-2'తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అనే తేడా లేకుండా.. ఈ సినిమాకి జరుగుతోన్న బిజినెస్ ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో కొద్దిరోజులుగా 'పుష్ప-2' పేరు మారుమోగిపోతోంది. పుష్ప-2' మేనియాలో ఉంటూ.. ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు, ప్రేక్షకుల కోసం మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.

'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా', 'ఊ అంటావా మావా', 'శ్రీవల్లి', 'సామి సామి', 'దాక్కో దాక్కో'.. ఇలా అన్ని పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే 'పుష్ప-2' సాంగ్స్ పై (Pushpa Songs) ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ కలిసి అద్భుతమైన పాటలను అందించబోతున్నారట. అంతేకాదు మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారట. మే మొదటి వారంలోనే సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం. ఇదొక మాస్ పాట అని, పుష్పరాజ్ పాత్రని మరింత లోతుగా ఆవిష్కరించేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ తో థియేటర్లలో మాస్ జాతర చూపించబోతున్నారని అంటున్నారు.

'పుష్ప-1'లోని పాటలు అన్నింటికీ చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యం తోడై.. పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప-2'లో తన కలం బలాన్ని మరింత చూపించబోతున్నారట చంద్రబోస్. పుష్పరాజ్ పాత్రని ఎలివేట్ చేస్తూ ఆయన రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ రావడం ఖాయమని చెబుతున్నారు.