English | Telugu
'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. ఫస్టాఫ్ సర్ప్రైజ్, సెకండాఫ్ పీక్స్!
Updated : Jan 3, 2024
మరికొద్ది రోజుల్లో అసలైన సినిమా పండుగ రాబోతుంది. ఈ సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదలవుతున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
తాజాగా ట్విట్టర్ స్పేస్ ద్వారా మహేష్ అభిమానులతో ముచ్చటించిన నిర్మాత నాగవంశీ 'గుంటూరు కారం'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫస్టాఫ్ లో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్స్ ఉంటుందని, సెకండాఫ్ చివరి 45 నిమిషాలు అదిరిపోతుందని తెలిపాడు. ఫస్టాఫ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందట. ఇక సెకండాఫ్ లో ఎమోషన్స్ హత్తుకుంటాయట. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ కట్టిపడేస్తుందట. ఇక థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి మ్యాజిక్ చేస్తాడట. అలాగే 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ థియేటర్లలో ఒక ఊపు ఊపుతుందట. మొత్తానికి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి సంక్రాంతికి మహేష్ నుంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా రాబోతుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను కూడా జనవరి 6న విడుదల చేయనున్నట్లు నాగవంశీ తెలిపాడు.
హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
