English | Telugu

‘కాంతార’ షూటింగ్‌లో నటుడు మృతి.. క్లారిటీ ఇచ్చిన యూనిట్‌!

‘కాంతార’ షూటింగ్‌లో నటుడు మృతి.. క్లారిటీ ఇచ్చిన యూనిట్‌!

రిషబ్‌ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం కన్నడలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో బ్లాక్‌బస్టర్‌ అయింది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్‌ని ప్లాన్‌ చేసింది యూనిట్‌. ‘కాంతార చాప్టర్‌1’గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా సర్క్యులేట్‌ అవుతోంది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌ మృతి చెందాడన్నది ఆ వార్త. అయితే దీనిపై కాంతార యూనిట్‌ ఒక కీలక ప్రకటన చేసింది. దాని సారాంశం ఏమిటంటే.. నటుడు కపిల్‌ ప్రమాదవశాత్తూ మరణించారన్నది నిజమేనని, అయితే అది షూటింగ్‌లో కాదని స్పష్టం చేశారు. అతని మృతికి, సినిమా యూనిట్‌కి ముడిపెట్టొద్దని చిత్ర యూనిట్‌ విజ్ఞప్తి చేసింది. హోంబలే ఫిలింస్‌ విడుదల చేసిన ఈ ప్రకటనలో.. ‘నటుడు ఎం.ఎఫ్‌. కపిల్‌ మృతికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. మా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే కపిల్‌ మృతి చెందాడని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన చనిపోయిన రోజు మా సినిమా షూటింగ్‌ జరగలేదు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. 

కేరళకు చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఎం.ఎఫ్‌.కపిల్‌ మే 6న నీటిలో మునిగి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఉడిపి జిల్లా బైందూర్‌లోని కొల్లూరులో ఈ విషాద ఘటన జరిగింది. తన మిత్రులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు కపిల్‌. నది లోతును అంచనా వేయలేకపోయిన కపిల్‌ నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఇది జరిగిన తర్వాత కాంతార షూటింగ్‌లోనే కపిల్‌ చనిపోయాడని ప్రచారం జరిగింది. దానికి సంబంధించి చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది.