English | Telugu

'టక్కర్'తో సరికొత్తగా వస్తున్న సిద్ధార్థ్!

'టక్కర్'తో సరికొత్తగా వస్తున్న సిద్ధార్థ్!

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'టక్కర్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'టక్కర్' టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. అప్పట్లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి ఘన విజయాలను అందుకున్న సిద్ధార్థ్.. ఈ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.

'టక్కర్'తో సరికొత్తగా వస్తున్న సిద్ధార్థ్!