Read more!

English | Telugu

రాజశేఖర్ సినిమాకి 70 కోట్ల బడ్జెట్..!

ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ పోషించి యాంగ్రీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర్.. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే కొంతకాలంగా వెనకపడిపోయారనే చెప్పాలి. ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు మంచి వసూళ్లు రాబడుతూ స్టార్లుగా కొనసాగుతున్నారు. అలాగే జగపతి బాబు, శ్రీకాంత్ వంటి హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం హీరోగా మంచి వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయారు. అలాగే జగపతి బాబు, శ్రీకాంత్ బాటలోనూ పయనించడం లేదు. ఆమధ్య రాజశేఖర్ విలన్ గా మారుతున్నారనే వార్తలొచ్చాయి కానీ అది జరగలేదు. ఇక నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'లో ప్రత్యేక పాత్ర పోషించారు కానీ.. అది ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో రాజశేఖర్.. ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిర్మిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి రాజశేఖర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. పలు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్యారీ.. నిఖిల్ హీరోగా నటించిన 'స్పై'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పటికీ.. టెక్నికల్ గా మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇప్పుడు గ్యారీ దర్శకుడిగా తన రెండో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడట. గ్యారీ ఓ అదిరిపోయే స్క్రిప్ట్ ని రెడీ చేసి, అమెజాన్ కి వినిపించగా.. వారు ఓకే చేయడం, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావడం జరిగిపోయాయట. ఈ సినిమా దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని, ఇందులో రాజశేఖర్ తో పాటు ఇద్దరు యంగ్ హీరోలు నటించనున్నారని వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

కాగా, ఈ భారీ ప్రాజెక్ట్ తో పాటు ఇతర స్టార్ల సినిమాల్లో విలన్ గా నటించడానికి కూడా రాజశేఖర్ సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా ఆయన మారిపోతారు అనడంలో సందేహం లేదు.