English | Telugu
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 'ఆదిత్య 999'.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Updated : Jul 26, 2025
నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు. అంతేకాదు, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు.. 'ఆదిత్య 999'. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే, ఈ చిత్రంలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల 'ఆదిత్య 999' ఆలస్యమవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు.. దర్శకుడిగా సినిమా చేసే సమయం దొరకడం అంత తేలిక కాదు. అందుకే కొంతకాలంగా 'ఆదిత్య 999' ఊసు లేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా 'ఆదిత్య 999' మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి క్రిష్ దర్శకత్వం వహిస్తారని, ఈ సినిమాలో బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని వినికిడి.
'ఆదిత్య 999'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలయ్య భావించారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర బాధ్యతలను దర్శకుడు క్రిష్ కి అప్పగించడం విశేషం. బాలకృష్ణ-క్రిష్ గతంలో కలిసి పని చేశారు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఆ తర్వాత 'కథానాయకుడు', 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఇప్పుడిది వీరి కాంబోలో నాలుగో సినిమా కానుంది.
సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనున్న 'ఆదిత్య 999'ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి నిర్మించనున్నారట. క్రిష్ డైరెక్ట్ చేసిన పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించే ఆలోచనలో ఉన్నారట.
క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో 'ఘాటీ' సినిమా చేస్తున్నారు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'ఆదిత్య 999' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.