English | Telugu
'ద కశ్మీర్ ఫైల్స్' సంచలనం.. మూడో రోజు 325 శాతం అధిక కలెక్షన్లు!
Updated : Mar 14, 2022
వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన హిందీ ఫిల్మ్ 'ద కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ దగ్గర భారీ పెరుగుదలను నమోదు చేసింది. హిందీ బెల్ట్లోనే కాకుండా హైదరాబాద్లోనూ ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు హౌస్ఫుల్ అవడం విశేషం. 'రాధే శ్యామ్' లాంటి భారీ బడ్జెట్ సినిమాతో పాటు విడుదలై, దాని నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న 'ద కశ్మీర్ ఫైల్స్'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ క్రమేపీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా మొదటి రోజుతో పోలిస్తే మూడో రోజు ఆదివారం ఏకంగా 325.35 శాతం అధికంగా కలెక్షన్లు వచ్చాయి. ఇదొక రికార్డుగా ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విడుదలైన శుక్రవారం రూ. 3.55 కోట్లు, శనివారం రూ. 8.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజు ఆదివారం ఏకంగా రూ. 15.10 కోట్లను రాబట్టింది. తద్వారా మూడు రోజుల కలెక్షన్లు రూ. 27.15 కోట్లకు చేరాయి. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా మెట్రో ఏరియాలు, మాస్ బెల్ట్లన్నింటిలోనూ ఓపెనింగ్ వీకెండ్ టెర్రిఫిక్ కలెక్షన్లను 'ద కశ్మీర్ ఫైల్స్' రాబట్టింది.
హిందీ బెల్ట్లో అయితే ఈ సినిమా ముందు 'రాధే శ్యామ్' నిలవలేకపోతోందని లెక్కలు చెప్తున్నాయి. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్, ప్రకాశ్ బెలవాడి లాంటివాళ్లు నటించిన 'ద కశ్మీర్ ఫైల్స్' మూవీ కశ్మీర్లో హిందువులపై జరిగిన మారణకాండ, వేలాదిమంది స్త్రీలపై అత్యాచారాలు, చిన్నపిల్లలను కాల్చిచంపిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. హైదరాబాద్కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు.