English | Telugu
'కేజీఎఫ్ 2' దెబ్బకు కుదేలైపోయిన టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2'
Updated : May 5, 2022
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'హీరోపంతి 2' బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. తారా సుతారియా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. తొలిరోజు 'హీరోపంతి 2' రూ. 7.5 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఆరో రోజు బుధవారంతో ఈ సినిమా వసూళ్లు రూ. 21.65 కోట్లకు చేరుకున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిందీ బెల్ట్లోని అత్యధిక థియేటర్లలో ఇప్పటికీ యశ్ మూవీ 'కేజీఎఫ్ చాప్టర్ 2' నడుస్తుండటం విశేషం.
'హీరోపంతి 2'కు ఇటు ప్రేక్షకుల నుంచి కానీ, అటు విమర్శకుల నుంచి కానీ అనుకున్న రీతిలో ఆదరణ లభించలేదు. దాని ఫలితం బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. ఆరో రోజు ఈ సినిమాకు రూ. 2.15 కోట్ల నుంచి రూ. 2.30 కోట్ల మధ్యలో వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటివరకూ ఈ సినిమా సాధించిన వసూళ్లు రూ. 21.65 కోట్లకు చేరుకున్నాయి. లైఫ్టైమ్లో ఈ మూవీ రూ. 30 కోట్లకు మించి వసూలు చేసే అవకాశం లేదని అంచనా. రోజులు గడుస్తున్న కొద్దీ పలు థియేటర్లను ఈ సినిమా 'కేజీఎఫ్ 2'కు కోల్పోతూ వస్తోంది. బుధవారం 'హీరోపంతి 2' సగటున థియేటర్లలో 10.86 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే సాధించింది.
అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన 'హీరోపంతి 2'లో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించారు. కృతి సనన్ జోడీగా నటించిన 'హీరోపంతి' సినిమాతోటే టైగర్ హీరోగా పరిచయమయ్యాడు. త్వరలో అతను తన తొలి సినిమా నాయికతో కలిసి వికాస్ బెహల్ రూపొందిస్తోన్న 'గణపత్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.