నిట్టూర్చాడు రమణయ్య.
"ఆశ చాలా చెడ్డది. డబ్బు వ్యామోహం జయించటం చాలా కష్టం. కానీ ప్రవాహానికి ఎదురీదడం సాధ్యం కాదు, పోనీ నష్టపోయినా పై పైదే పోతుంది. అసలుకి ముప్పురాకుంటే సరి" అనుకున్నాడు.
రామూని భుజాన వేసుకుని ఊరల్లా తిరిగాడు రమణయ్య. రైసు మిల్లు వాళ్లు కానీ, పసుపు వ్యాపారస్తులు కానీ ఎవరూ కానీ చూపలేదు. ఉస్సురని నిట్టూర్చి ఒట్టి చేతులతో యింటికి తిరిగొచ్చాడు.
అన్న ముఖం చూసి ఏమీ అడగలేకపోయాడు గోపీ.
రాము రమణయ్యని విడిచి గోపీ వద్దకి రానేలేదు. వాడికి రమణయ్య మీసాలూ, బుగ్గలూ చాలా వింతగా కుతూహలంగా వున్నాయి.
మరుసటిరోజు పట్టణానికి వెళ్ళేడు రమణయ్య. అక్కడెవరయినా వ్యాపారస్తులు అడ్వాన్సుగా డబ్బిస్తారేమోనని శతవిధాలా ప్రయత్నించాడు.
చివరికి ఓ సేట్ ని పట్టుకున్నాడు. ఆ సేటు ఏదైనా పల్లెలో రైసు మిల్లు ప్రారంభించాలనే వుద్దేశ్యంలో వున్నాడు రమణయ్య అతనికేమీ కొత్తకాదు. రమణయ్య ఆస్తీ, యిల్లూ అతని వ్యవసాయం గురించి విన్నవాడే.
"ఆయీయే భాయ్ ఆయీయే! రండి కూర్చోండి. ఎం విశేషాలు యిలా వచ్చారు? అని కులాసాగా నవ్వుతూ ప్రశ్నించాడు.
"ఉదయమనగా వచ్చాను. పనిపై తిరుగుతున్నాను, మీ టౌను వాళ్లు డబ్బును చూస్తారు కానీ మనుషుల్ని చూడరు. మంచిమంచిగా మాటలు చెపుతారు. కాఫీలు, టీలు, డ్రింకులు యిస్తారు. అవసరమని వస్తే మొండిచెయ్యి చూపుతారు" నిష్టూరంగా అన్నాడు రమణయ్య.
"అరరే! ఏమ్ మాటలు చెవుతావ్ భాయ్, నీ పనేమిటో చెప్పు చేస్తాం"
"డబ్బు కావాలి?"
"ఎంత కావాలి? ఎప్పుడు కావాలి."
"పాతికవేలు కావాలి, పంటరాగానే యిచ్చేస్తాను"
"అబ్బో! పాతిక వేలే! కష్టం భాయి"
"నే చెప్పలా! మీ పద్ధతే అంత!"
"అదికాదు భాయ్, అంత డబ్బు వూరికే ఎలా యివ్వగలం చెప్పు. మాకీ పూచీ వుండాల" అన్నాడు సేట్.
"ఏమి కావాలో చెప్పండి"
"మాకీ మీది యిల్లు కావాలి. యిస్తారూ?
"ఇల్లా?"
"అవును! మేం రైసుమిల్లు పెట్టాలని వున్నాం. మీ యిల్లు అయితే బాగా వుంటుంది."
సేట్ ఆశ చూసిన రమణయ్యకి వళ్ళు మండింది.
మాట్లాడకుండా లేచాడు.
"ఏమి భాయ్! వెళతావా?"
పలక్కుండా వెళ్ళేడు రమణయ్య.
దిగాలుముఖంతో యింటికి వచ్చిన అన్నయ్యని చూసి నిరాశతో కృంగిపోయాడు గోపీ, చీకటి పడ్డాక వచ్చాడు ఆయన. ఆ సమయానికి రాము నిద్రపోయాడు.
విషయమంతా వివరించి చెప్పాడు రమణయ్య.
"అన్నయ్యా! నేనో మాట చెపుతాను వింటావా."
"చెప్పు గోపీ!"
"ఇంత యిళ్ళు రెండు మనకెందుకు? మేమెలాగూ యిక్కడికి వచ్చి వుండేదిలేదు, మరి కొన్నేళ్ళు పోతే నీవూ అక్కడికే వచ్చేయాలి. అలాంటప్పుడు ఒక యిల్లు అమ్మేస్తే ఏం?"
నిర్ఘాంతపోయాడు రమణయ్య.
"ఇది చికిత్సచేసే వ్యాధి కాదు" అనుకున్నాడు ఆయన.
"గోపీ! ఈ రోజు యిల్లు అమ్ముకుంటే మళ్ళీరాదు. కానీ అమ్మెయ్యమంటే నాకేం అభ్యంతరం లేదు."
"నీవు బాధపడేట్టయితే అక్కర్లేదన్నయ్యా! వ్యర్ధంగా డెడ్ కేపిటల్ గా యిక్కడ యిల్లు వుండేదానికంటే వ్యాపారంలో పెడితే మంచిదని నా అభిప్రాయం" అన్నాడు గోపీ.
రమణయ్య యింకేమీ అనలేదు.
మరుసటి రోజు ఉదయమే యిద్దరూ టౌన్ కి వెళ్ళి యిల్లు అమ్మేశారు. గోపీ ఒక్కడే రిజిస్ట్రేషన్ లో సంతకం చేశాడు. సేటు అడగ్గా అది వాడి పేరనే వుంది అని దస్తావేజులు చూపాడు రమణయ్య.
డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు గోపీ కొడుకుతో సహా.
దిగాలు పడిన మనస్సుతో తిరిగివచ్చిన రమణయ్య మేడ ఖాళీ చేసి పూరి పాకలోకి మారాడు. పశువులకి తనకీ అడ్డంగా దడి కట్టించాడు.
ఊరిలో నలుగురూ నాలుగువిధాల అనుకున్నారు. అవి రమణయ్య చెవిదాకా రానేలేదు.
14
కాలచక్రంలో భగవంతుడికి ఆరునెలల కలసివచ్చేయి.
ఫణి, గోపీ లీజుకు తీసుకున్న ధియేటర్లో వచ్చిన సినిమాలలో రెండు శతదినోత్సవాలు చేసుకున్నాయి. అంతక్రితం ఏ సినిమా కూడా అందులో నాలుగు వారాలకి మించి ఆడలేదు. యాజమాన్యం మారటమో, మంచి సినిమాలు రావటం కారణమో తెలియదు కానీ, రెండు సినిమాలు శతదినోత్సవం చేసుకున్నాయి.
మొదటి సినిమా ఓ ప్రముఖ హీరో వున్న చిత్రం. రాకరాక ఐదారు నెలల తరువాత, వచ్చింది అతని చిత్రం, ఆ చిత్రంకోసం ఫణి మద్రాసుకి వెళ్ళి నిర్మాతతో మాట్లాడి విజయవాడ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి ఆ చిత్రం తెచ్చుకున్నాడు. యాజమాన్యం మారుతూనే వచ్చిన తొలిచిత్రం అది.
బ్రహ్మాండమైన అలంకరణతో సినిమా ప్రారంభించారు. మొదటిరోజు అయిదాటలు వేశారు. ఆనాడు వచ్చినంత కలెక్షన్ ఆ ధియేటరు కట్టేక రాలేదు. అంతా ఫణి అదృష్టం అని పొగిడారు.
ఈ సినిమా ధియేటర్ తీసుకున్నాక మేనేజరుగా వుండేందుకు ఫణి తన బావమరిదిని తెచ్చేడు. ధర్మారావు బావగారికి అన్ని విధాలా తగినవాడు. అది జాయింటు వ్యవహారం అనగానే అతనికి అంతా అవగాహన అయింది. బుకింగ్ క్లర్కులనందర్నీ పాతవాళ్ళని తీసివేసి కొత్తవాళ్ళని తెచ్చేడు. ఆ విషయమై పాత యజమానులు ఏదో అనబోయేరు. కానీ తమ అగ్రిమెంటులో ఆ విషయమై ఏమీ లేనందువల్ల వాళ్ళ మాట సాగలేదు.
ఆ చిత్రం శతదినోత్సవం అయిన మూడోరోజే మరో ప్రముఖ హీరో చిత్రం వచ్చింది. అది పౌరాణిక సినిమా! దాని విజయం చూసిన గోపీ, రాధలకి సినిమాలలో ఎంత ఆదాయం వుందో అర్ధమైంది.
ఆరునెలల పూర్తికాగానే ఆ రెండు సినిమాలలో ఎంత వచ్చింది, ఖర్చులెంత అయిందీ, నికరాదాయం ఎంత వుందీ వివరంగా లెక్కలు చూపించాడు ఫణి. మ్యాటినీలు వేసిన పాత సినిమాలవల్ల ఎంత వచ్చింది నికరంగా చూపేడు.
తమ వాటాకి ముప్పైవేలు వచ్చిందని చెపితే నిలువుగుడ్లు పడ్డాయి యిద్దరికీ.
"ఈ సొమ్ములో పైసా యివ్వను మీ చేతికి మన అసలు వచ్చేసింది వడ్డీతోసహా. ఇక మిగిలిన ఆరునెలలు ఆడిందంతా ఆదాయమే" అన్నాడు ఫణి.
"అక్కర్లేదు ఇవ్వకండి. ఇంకో బిజినెస్ లో పెట్టండి" అంది రాధ.
అప్పుడు ఓ ప్రపోజల్ పెట్టేడు ఫణి.
"మద్రాసులో మన హీరోగారు స్వంతంగా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. ఎగ్జిబిటర్స్ గా మనం వెళ్ళాలి, అందరమూ వెళదాం."
సంతోషంగా అంగీకరించింది రాధ.
ఇద్దరూ కాలేజీకి పదిహేను రోజులు సెలవు పెట్టారు. అంతలో కాలేజీకి సెలవులు వచ్చేస్తాయనీ, అటు నుంచి అటే మైసూరు వెళ్ళి వెకేషనల్ ఎంజాయి చేసి వస్తామనీ చెప్పారు ఇద్దరూ. సెలవు గ్రాంట్ చేసుకుని అందరూ బయలుదేరారు చక్రవర్తి తెచ్చిన కార్లో.
స్వంత కార్లో ప్రయాణం చాలా ఆనందంగా వుంది, పాత అంబాసిడర్ కాస్త చౌకగా వస్తూంటే నలుగురికీ ఉంటుందని ఉమ్మడిగా కొన్నాడు ఫణి. కాస్త మైనర్ రిపేర్సు చేయించి కలర్ వేయించి మంచి కండిషన్ లో వుండేట్టు చేయించాడు.
మద్రాసులో మంచి హోటల్లో దిగేరు. నలుగురూ ఫణికి డ్రైవింగ్ రావటం వల్ల సిటీ చూడటానికి కార్లోనే ప్రయాణమయ్యారు ఆ వీధుల్ని, ఆ మనుషుల్నీ చూస్తూ వుంటే డబ్బుంటే చెన్నపట్నంలోనే బ్రతకాలనిపించింది రాధకు.
ఎవరెవరికో ఫోన్స్ చేశాడు ఫణి.
ఆ సినిమా ప్రారంభ ముహూర్తం యింకా రెండురోజులుంది. ఈ రెండు రోజులూ మద్రాసులో చూడవలసినవన్నీ చూద్దాం అనుకున్నారు.
పారిస్ కార్నర్ తో ప్రారంభమైంది వాళ్ళ సిటీ ట్రిప్. స్నేక్ పార్క్, గాంధిమంటపం, కల్యాణ మంటపం, జూ, మ్యూజియం ,ఏరోడ్రమ్, మూర్ మార్కెట్, మౌంట్ రోడ్ టి.నగర్ లైబ్రరీ అన్నీ చూశారు. హైకోర్టులో లైట్ హౌస్ ఎక్కేరు.
సినిమా వాళ్ళపైకి మళ్ళింది సంభాషణ ఓ రోజు రాత్రి.