అతనేదో అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించి ఆమె లేచింది.
"వెళ్ళిరండి" అన్నాడు క్లుప్తంగా.
ఆమె వెళ్ళిపోయింది దిగులుగా.
14
ఆ రోజే మంత్రిగారొస్తున్నారు.
అంతకు క్రితం రోజే శంకరానంద్ వచ్చి ఖాళీలు పూర్తిచేయించుకు వెళ్ళాడు. వర్తక సంఘాల వాళ్ళు, వాళ్ళ యిళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగితే వధువు పేరు, వరుడి పేరు, తలిదండ్రుల పేర్లు, ముహూర్తం తేదీలు మాత్రం మార్చి సన్మాన పద్యాలు సమర్పిస్తారు. ఎన్ని సంవత్సరాలు క్రితమో ఎవరో తమకు అనుకూలుడైన కవిచేత ఉచితంగా అందరికీ వర్తించేట్లుగా పద్యాలు రాయించి ఓ పదివేల కాపీలు దాకా అచ్చు వేయిస్తారు. ఏడాదికో రెండేళ్ళకో మళ్ళీ అచ్చుకొట్టిస్తారు. ఈ మధ్యకాలంలో ఆయా ఎంట్రీలు పూర్తిచేయించి అచ్చు వేయిస్తారు అంతే.
ఈ పద్యాలూ అలాగే అయ్యాయి.
శంకరానంద్ వచ్చి వెళ్ళిన రోజునే పద్యాలు రాసి పెట్టాడు --- సన్మానపత్రం తీసికెళ్ళాడు. విజ్ఞాపనా పత్రం కూడా తయారయింది.
శంకరానంద్ బహుధా ప్రశంసించాడు.
"నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఈ ఊళ్ళో ఏ సన్మానం జరిగినా నీతోనే రాయిస్తారందరూ. నే పేరు ఊరిలో మార్మోగిపోతుంది" అన్నాడు.
రవికి అదేం రకం పొగడ్తో అర్ధంకాలేదు.
"రవీ, ఈ పద్యాన్ని బ్లాకు చేయిస్తాయినోయ్. పేర్లు మాత్రం ఖాళీలు వదలుతాను."
"ఎందుకండీ? ఏ సందర్భాన్ని తగ్గట్టుగా అప్పుడు రాయిస్తే బావుండవా?" అన్నాడు. అతడికి ఈ రడీమేడ్ సరుకు బిజినెస్ బొత్తిగా అర్ధంకాలేదు.
"వీటిల్లో వున్న చిక్కు నీకు తెలియదులే. సరిగ్గా ఏ అర్ధారాత్రో ప్రోగ్రాం వస్తుంది. మరుసటిరోజే మంత్రి దిగుతారు. అప్పుడు పద్యాలు రాసే నిన్ను వెదుక్కోవాలా? ప్రెస్సు వాళ్ళని బ్రతిమిలాడాలా? ఇదయితే సుళువు. చకచకా వందో రెండొందలో అచ్చేస్తాను."
"ప్రతిసారీ చదివిన పద్యాలే చదివితే ---"
"ఎవరు గుర్తు పెట్టుకుని చస్తార్లే. ప్రతివాడికి అప్పటికప్పుడు పద్యాలు కొత్తే. వాగ్ధానాలే గుర్తుండవు - ఇక సన్మాన పద్యాలు ఎక్కడ గుర్తుండిచస్తాయ్? వాళ్ళ పేరు వినబడితే, కనబడితే చాలు."
సభాస్థలికి వెళ్ళేసరికి అన్నీ గుర్తుకొచ్చాయి రవికి.
అతనికి నవ్వొచ్చింది. "ఈ బలవంతం మాఘస్నాన లాటి సన్మానాలలో వీళ్ళకేం జరుగుతుంది---వాళ్ళే ఒరగబెడతారు?" అనుకున్నాడు.
శంకరానంద్ కనిపించాడు హడావిడి అంతా అతని తలపైన్నే వున్నట్టుగా వుంది.
"నమస్తే!"
"నమస్తే!" అతను రవి నమస్కారాన్ని కూడా సరిగా రిసీవ్ చేసుకోలేదు.
గాయపడినట్టయింది రవికి.
మంత్రిగారింకా రాలేదు. అసలు హైదరాబాద్ లోనే యింకా బయలుదేరలేదని కొందరూ మార్గమధ్యంలో ఎక్కడో టి.బి.లో వున్నారని కొందరూ అనుకుంటున్నారు.
లంచ్ కి వస్తాడన్న మనిషి మధ్యాహ్నం దాటిపోయినా రాలేదు.
అవసరార్ధం కాచుకున్న వాళ్ళూ, ఆశ్రితులూ ప్రాణాలుగ్గబట్టుకుని కూర్చున్నారు.
సాయంకాలం నాల్గింటికి వచ్చాడు మంత్రివరేణ్యుడు.
హడావిడిగా టీ యిచ్చారు అందరికీ.
ఉదయంనించీ భోజనం లేని రవి టీ కూడా తీసుకోలేదు. పత్రికా రచయితలతో పాటే వున్న అతన్నీ పిలిచారు. అయినా వెళ్ళలేదు.
సభ ప్రారంభమైంది.
ఎవరో గేయం పాడారు "మా తెలుగుతల్లి" చెవుల్లో మార్మోగ్రింది.
సన్మానపత్రం చదవటానికి రవినే పిలిచారు.
కొత్త! సభలు కొత్త కాకపోయినా వాతావరణం కొత్త అయినా ధాటిగా తడబాటు లేకుండా నిదానంగా చదివాడు.
"బాగా చదువుతున్నాడే!" మెచ్చుకున్నాడు మంత్రిగారు.
తర్వాత పద్యాలు---
అవీ రవే చదివాడు. రాగచ్ఛాయగా చదివాడు.
మంత్రిగారు మెచ్చుకున్నారు.
మైకు లాక్కుని "ఈ అబ్బాయిలో మంచి స్పార్క్ వుంది! మనం కవులని గౌరవించాలి! మన దేశం కవులకు పుట్టిల్లు - కళలకు పుట్టిల్లు. కృష్ణరాయలు పాలించిన రాజ్యం మనది--- ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. మనకూ ఆస్థాన కవి ఉన్నారు. ఆయన తన తరపున జిల్లాకొక కవిని నియమించాలి. ప్రభుత్వం కవులని ఎందర్ని పోషిస్తుంది, ప్రజలే ఆదరించాలి. నేను ఈ కవిని గొప్పగా, మనస్ఫూర్తిగా సన్మానిస్తున్నాను" అని తనకు మెడలో వేయగా తీసిన దండ రవి మెడలో వేశాడు.
అంతేకానీ తనకి కప్పిన కాశ్మీరు షార్ కప్ప లేకపోయాడు! అదే రాజకీయం మరి!
రవి గొప్పగా ఫీలయ్యాడు.
శంకరానంద్ హాలు దద్దరిల్లేట్లుగా చప్పట్లు కొట్టేడు.
తర్వాత రాజకీయసభ జరిగింది. రవి ఓ వారగా నుంచుని వింటున్నాడు. అందరూ యధాశక్తి వాగ్దానాలతో మనుషుల్ని తీసేశారు! అరచేతిలో వైకుంఠాన్ని దర్శింపచేశారు!
ఎన్నడూ అలాటి సభలకి వెళ్ళని రవికి వాళ్ళ ధోరణి అసహనాన్ని కలిగించింది. వీళ్లు ఎంత సులువుగా బోల్తా కొట్టిస్తున్నారు అనుకున్నాడు.
అంతకంటే సులువుగా బోల్తాపడుతున్న ప్రజల్ని చూసి జాలిపడ్డాడు.
ఆరింటికి సభ ముగిసింది.
మంత్రిగారు లోపలికి వెళ్ళిపోయారు.
అవసరాలున్న వాళ్ళంతా ఆయన వెంటే దూరేరు.
అపుడు లంచ్ ఏర్పాటైంది.
అది నాన్ వెజిటేరియన్ కాబట్టి రవి అటుగా వెళ్ళలేదు. అతనికి ఆ వాసనే గిట్టదు.
దూరంగా ఓ వారగా నుంచున్నాడు.
జర్నలిస్ట్ మిత్రులు కొందరు అటు, మరికొందరు వెజిటేరియన్ వైపూ వెళ్ళిపోయారు.