దండనాయకుడు.. శని దేవుడికి ఆవ నూనె ఎందుకు సమర్పిస్తారంటే..!

 


శనిదేవుడు న్యాయ దేవుడు,  కర్మ ఫలాలను ఇచ్చేవాడుగా చెబుతారు. ఛాయాపుత్రుడు అయిన శని దేవుడికి  హిందూ మతంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఆయన కృప,  కోపం రెండూ ఒక వ్యక్తి జీవితాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి,   ఆయన ప్రతికూల దృష్టిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటారు. అలాంటి  ప్రధాన పనులలో ఒకటి ఆయనకు  ఆవ నూనెను సమర్పించడం. అయితే శని దేవుడికి నువ్వుల నూనె సమర్పించడం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ.. ఆవ నూనె సమర్పించడం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అసలు శని దేవుడికి ఆవ నూనె ఎందుకు సమర్పిస్తారు తెలుసుకుంటే..

రాముడి సైన్యం లంకకు సేతువు నిర్మిస్తున్నప్పుడు ఆ వంతెనను రక్షించే బాధ్యత హనుమంతుడిదేనని నమ్ముతారు. ఈ సమయంలో, హనుమంతుడి బలానికి,  కీర్తికి ముగ్ధుడైన శని దేవుడు హనుమంతుడితో   పోరాడటానికి వచ్చాడు. హనుమంతుడు రాముడి పట్ల భక్తిలో మునిగిపోయాడు, పోరాటం వద్దని  శనిదేవుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ శనిదేవుడు యుద్ధం చేయాల్సిందేనని మొండితనం చేశాడు.

శనిదేవుడి మొండితనం కారణంగా  శనిదేవుడికి,  హనుమంతుడికి  మధ్య భీకర యుద్ధం జరిగింది.  దీనిలో హనుమంతుడు  శనిదేవుడిని  ఓడించాడు. యుద్ధంలో గాయపడటం వల్ల శనిదేవుడు భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. అప్పుడు హనుమంతుడు శని దేవుడి నొప్పిని తగ్గించడానికి ఆవ నూనెను శని దేవుడి  శరీరంపై పూశాడట. ఆవ నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శనిదేవుడి గాయాలకు  చాలా  ఉపశమనం కలిగించి  నొప్పిని తగ్గించిందట.

ఈ సంఘటన తర్వాత శనిదేవుడు తనకు భక్తితో ఆవనూనెను సమర్పించే భక్తుడి కష్టాలన్నీ తొలగిపోతాయని,  తన ఆశీస్సులు భక్తుడిపై  ఉంటాయని చెప్పాడట. అప్పటి నుండి శనిదేవుడికి ఆవాల నూనెను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆవ నూనె శనిదేవుడికి సంబంధించినది. ఆవ నూనె నలుపు రంగులో ఉంటుంది,  శనిదేవుడికి  నలుపు రంగు అంటే చాలా ఇష్టం. దీనితో పాటు ఆవ నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  ఇది శనిదేవుని చల్లని స్వభావాన్ని సమతుల్యం చేస్తుందట.  ఆవ నూనెను సమర్పించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడని,  భక్తుల జాతకంలో శని దోషం,  ఏలినాటి శని వంటి ఇతర శని దోషాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు.


                                    *రూపశ్రీ.


More Vyasalu