శ్రీమహావిష్ణువు పరమభక్తుడు ఆదిశేషుడు

శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను  ఆ స్వామికి మెత్తటిపరుపులాగ ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంటుంది. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలా వుండగా, ఒకరోజున ఆదిశేషునికి శ్రీమహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు. "ఎందుకిలా జరుగుతోంది?" అని ఆశ్చర్యపోయిన ఆదిశేషుడు, అదే విషయాన్ని గురించి శ్రీమహావిష్ణువుతో చెప్పాడు. అది విన్న విష్ణుమూర్తి, "ఆదిశేషా ! నిన్న భూలోకానికి వెళ్ళాను కదా! అక్కడ ఓ పుణ్య ప్రదేశంలో శివుడు తాండవనృత్యాన్ని చేయడము చూసాను. త్రినేత్రుని తాండవ నృత్యాన్ని చూసిన నా మనసు సంతోషంతో నిండిపోయింది. అందుకే నా శరీరం కూడా బరువెక్కింద"ని నవ్వుతూ చెప్పాడు. విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుని మనసులో కూడ చిన్న ఆశ మొలకెత్తింది. ఎలాగైనా తాను కూడ శివతాండవ నృత్యాన్ని చూసి తరించాలి. "నేను కూడ ఆ స్వామి తాండవనృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి?" అని తన స్వామిని అభ్యర్థించాడు ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు, "ప్రస్తుతం శివ పరమాత్మ  భూలోకములో ఓ పుణ్యప్రదేశంలో తాండవం చేస్తున్నాడు. నువ్విప్పుడు అక్కడకు వెళ్ళితే, ఆయన తాండవ నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు" అని చెప్పాడు. చేయడమే కాదు, వెంటనే చూసి తరించమని ఆదిశేషునికి తన అనుమతిని కూడ ఇచ్చాడు.

వెంటనే ఆదిశేషుడు మనిషితల, పాము శరీరముతో కూడిన ఓ చంటిబిడ్డ రూపాన్ని ధరించి అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయాదేవి చేతులలో పడ్డాడు. మనిషి తల, పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే ఒళ్ళు జలదరించుకున్న అనసూయదేవి, తన చేతులను గట్టిగా విదిలించి, ఆ బిడ్డని దూరంగా విసిరేసింది.

కిందపడిన ఆ బిడ్డ, "తల్లీ! భయపడవద్దు. నేను మీ కుమారుడిని. నన్ను మీరే పెంచాలి" అని పలుకుతూ అనసూయాదేవి పాదాలపై పడటంతో, ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న అనసూయ, 'పతంజలి' అని పేరు పెట్టి పెంచుకోసాగింది. అలా అత్రి మున్యాశ్రమంలో పెరిగిన పతంజలి సకలశాస్త్ర కోవిదుడైయ్యాడు. శివదేవుడు చిదంబరములో ఆనందతాండవం చేస్తూంటాడని తెలుసుకున్న పతంజలి, ఒకరోజున తన తల్లిదండ్రుల అనుమతితో శివతాండవాన్ని చూడడానికి బయలుదేరాడు. ఆదిశేషుడు పతంజలి రూపాన్ని ధరించడం వెనుక గల అసలు కారణం ఇదేగా!

ఆదిశేషుడు వ్యాకరణానికి అధిదేవత. ఆయన ఈ భూలోకానికి పతంజలి రూపంలో వచ్చాడని తెలుసుకున్న విద్యార్థులు, భూలోకం నలుమూలల నుండి, ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోవడానికి తరలివచ్చారు. పతంజలికి ధర్మసంకటం! తాను పరమశివుని తాండవనృత్యాన్ని చూసేందుకు వచ్చాడా? లేక ఈ విద్యార్థిలోకానికి వ్యాకరణ పాఠములు నేర్పేందుకు వచ్చాడా? అయితే, తనను వెతుక్కుంటూ వచ్చిన విద్యార్థులకు తగిన విద్యను బోధించడం గురువుయొక్క విద్యుక్తధర్మ. కానీ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ, తన అమూల్యమైన కాలాన్ని ఖర్చు చేయలేడు. ఆ మరుక్షణమే పతంజలి మనసులో ఓ ఆలోచన. ఆదిశేషుని అంశమైన తనకు వేయితలలు కదా! కాబట్టి తన వేయి తలలతో ఒకేసారి వెయ్యిమంది విద్యార్థులకు పాఠాలను చెప్పొచ్చు. అయితే తను వేయి తలలతో కొలువు దీరి ఊపిరి పీలుస్తూ వదిలితే, అప్పుడు విడుదలయ్యే విషవాయువు వలన విద్యార్థులు దగ్ధమైపోయే అవకాశం ఉంది.  

అందుకనే తను పాఠాలు చెబుతున్నప్పుడు, తనకు ఆ విద్యార్థులకు మధ్య ఓ తెరను కట్టమన్నాడు. అలా తాను తెరవెనుక ఉండి వేయి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పసాగాడు పతంజలి. పాఠాలు చెప్పేముందు విద్యార్థులకు రెండు నిబంధనలను విధించాడు పతంజలి. తను పాఠం చెబుతున్నప్పుడు ఎవ్వరూ కదలకూడదనేది మొదటి నిబంధన. కడలి బయటకు వెళ్ళే విద్యార్థి బ్రహ్మరాక్షసునిగా మారిపోయి, నాలుగు రహదారుల కూడలిలో నున్న చెట్లకు దెయ్యాలా తలక్రిందులుగా వ్రేలాడతారన్నది రెండవ నిబంధన. పతంజలి అలా నిబంధనలను విధించడం వెనుక ఓ అంతరార్థం ఉంది. అధ్యాపకులు పాఠం చెబుతున్నప్పుడు, విద్యార్థులు మధ్యలో లేచి బయటకు వెళితే, పాఠాలు సరిగ్గా వారి బుర్రలకెక్కవు. ఫలితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు, చెట్లకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న దెయ్యలవలే మారుతుందన్నది పతంజలి చెబుతోన్న నిత్యసత్యం.


More Shiva