గోధుమ-మినప ఇడ్లీలు
గోధుమలు ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గోధుమలతో కేవలం చపాతీలు మాత్రమే కాదు ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
గోధుమలు - 1 1/2 కప్పు
మినప్పప్పు - 1 కప్పు
నానబెట్టిన బఠాణీ - 1/4 కప్పు
క్యారట్ తురుము - 1/4 కప్పు
బీన్స్ తరుగు - 1/4 కప్పు
పెరుగు - 1/2 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
ఆవాలు - టీ స్పూను
మినప్పప్పు - 2 టీ స్పూన్లు
శెనగపప్పు - 2 టీ స్పూన్లు
అల్లం తరుగు - 1 స్పూను
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
తయారి విధానం:
గోధుమలను రెండు గంటలు మినప్పప్పును అర గంట నీటిలోనానబెట్టాలి. అలా అవి నానిన తర్వాత గోధుమలను మరీ మెత్తగా కాకుండాకొంచం బరకగా మిక్సీ పట్టాలి. మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. (అంటే మనం ఈ ఇడ్లి వేసుకోవాలనుకనే ముందు రోజు రాత్రి పిండిని తయారు చేసుకుంటే మంచిది). బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని ఇడ్లీ రేకులలో వేసి మాములు ఇడ్లీల లాగానే ఉడికించుకోవాలి.
ఆరోగ్యానికి మేలు చేసే గోధుమ మినప ఇడ్లీ మంచి చట్నీతో కలిపి తింటే బాగుంటుంది.
....కళ్యాణి