బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు. అవును రెండు రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి రెండు గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి.. డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్యా వివాదం సర్డుమణిగింది అనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగతున్న నేపధ్యంలో ఇద్దరు కలిసి కూర్చుని.. ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్ కు మంచి సంకేతం పంపుతుందని అంటున్నారు.
నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో, ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో అంతర్గత కుమ్ములాటల గురించి పార్టీలో, ప్రజల్లో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ , హరీష్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపద్యంలోనే బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరిగడమే కాకుండా.. హరీశ్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, హరీష్ రావు ఈ వార్తలను ఒకటికి పదిసార్లు ఖండించారు. అంతే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా, తనకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే.. గత పాతికేళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి, హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్ తో ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ మాట జవదాటలేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు.
ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా, పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత రోజుర్జుకు పెరుగుతూ వచ్చిన సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు. ప్రశ్నించలేదు. కేసీఆర్ మాట జవ దాటలేదు. కాబట్టి.. ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా హరీష్ రావు ఎదురు తిరిగక పోవచ్చని అంటారు.
అయినా అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్ధుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపద్యంలో.. భవిష్యత్ బంధాలు ఎలా ఉంటాయి అనే విషయంలో సహజంగానే హరీష్ రావు వర్గంలో అనుమానాలు ఉన్నట్లు చెపుతున్నారు. నిజానికి పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్నా పెద్ద పొరపొచ్చాలు ఎన్ని వచ్చినా, కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్డుబాటు చేస్తూ వచ్చారు. కానీ, పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్ళిన తర్వాత తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు.
అందుకే, కేసీఆర్ చొరవ తీసుకుని, నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని కేసీఆర్ ఇటు హరీష్ రావు ను, అటు కేటీఆర్ ను కన్విన్స్ చేసినట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా అభ్యంతరం చెప్పను అని మీడియా ముఖంగా, ప్రకటించారని చెపుతున్నారు.
అలాగే, కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆరే పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా రెండు గంటల పాటు జరిగిన భేటీలో చాలా విషయాలు ఖుల్లం ఖుల్లా చర్చకు వచ్చినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముఖ్యనాయకుల మధ్య విబేధాలు లేక పోవడమే కాదు, విబేధాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి బలంగా తీసుకు పోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఇక పై ప్రతి విషయంలో ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్ పై దృష్టిని కేంద్రీకరించారని చెపుతున్నారు. అయితే ముందు ముందు ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత సంగతేంటి? ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడవలసిందే అంటున్నారు.