LATEST NEWS
మెజార్టీకి అవసరమైన మద్దతు కూటగట్టుకుంటామని, ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరితే.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతం టీవీకే వద్ద లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేస్తూ అనుమతి తిరస్కరించారు. ఆ క్రమంలో విజయ్‌కు రాజకీయ మద్దతు పెరుగుతూ.. , రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్  పార్టీగా అవతరించినప్పటికీ..  ప్రభుత్వ  ఏర్పాటు   విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు. మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో..  ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విజయ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారనీ,  మరే ఇతర కూటమి  కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటోందని సీపీఎం తీవ్రంగా ఆరోపించింది.  విజయ్‌కు కేవలం సీపీఎం మాత్రమే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు కూడా ప్రజా తీర్పును గౌరవించి విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..  తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికింది. మరో వైపు డీఎంకే కూడా కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు తాము అడ్డపడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టి పారేశారు. 
ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక మార్పులు చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును పార్టీ హై కమాండ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది.  కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన  తెలుగుదేశం హైకమాండ్..   క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ   మార్పులు చేసినట్లు పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రొటోకాల్ వివాదం తీవ్ర  చర్చనీయాంశమైంది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో  వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జ్‌గా తనను తప్పించడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారన్న వర్మ.. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని  స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పోటీ నుంచి  అయిష్టంగానే తప్పుకున్న వర్మ.. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. అప్పట్లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలో పిఠాపురంలో ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ పరిణామం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డుకోబోమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందన్న ఆయన..  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు. అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్నిన ఆయన కొట్టిపారేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదనీ, అవన్నీ వదంతులేనని స్టాలిన్ స్పష్టం చేశారు.  కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామన్నారు. 
కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనూహ్య షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆయనకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను ప్రభుత్వం  ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌తో కూడిన సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ తీసుకున్న   నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీసింది. గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు..  ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే..  తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న గన్‌మెన్లను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.  టీవీకే తాజా ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగరి భద్రత యథావిధిగా కొనసాగుతోంది.  ఈ పరిణామంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.  
తమిళనాడు రాజకీయాలు మరోసారి  ఉత్కంఠభరితంగా మారాయి.   కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా క్యాంపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపాడుకునేందుకు అన్నాడీఎంకే అధిష్టానం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలను బుధవారం ( మే 6) పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు  తరలించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ' తమిళగ వెట్రి కళగం  (టీవీకే) 108 స్థానాలతో  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే..  ప్రభుత్వ  ఏర్పాటుకు  అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో  ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని టీవీకే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరగడంతో అన్నాడీఎంకే  అప్రమత్తమైంది. సీనియర్ నేత సీవీ షణ్ముగం ఆధ్వర్యంలో పుదుచ్చేరిలోని  ది షోర్ త్రిశ్వమ్  రిసార్టులో దాదాపు 20 గదులను పార్టీ ముందుగానే బుక్ చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపుతో ..  అటు టీవీకే కూడా తమ ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురం రిసార్టులకు తరలించింది. ఒకవైపు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతుంటే.. మరోవైపు బద్ధ శత్రువులుగా పేరున్న డీఎంకే మరియు అన్నాడీఎంకే నేతల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తమిళరాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.  ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కోరగా.. సంపూర్ణ మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే రావాలని గవర్నర్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.  ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పార్టీలకు సవాలుగా మారింది. రానున్న రెండు మూడు రోజుల్లో సంఖ్యా బలంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత వరకూ తమిళనాట క్యాంపు రాజకీయాలు కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  నేడు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తన కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు, తన వ్యక్తిగత జీవితం మరియు తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.   తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్  పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఎందుకు  ఆహ్వానించడం లేదు.  విజయ్‌(VIjay)ని సీఎం కాకుండా అడ్డుకోవడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఆయన్ని కురుక్షేత్రంలోని అభిమన్యుడిలా పద్మవ్యూహంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విజయ్ నాకు 1996 నుండి తెలుసని, ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని,  అధికారం కోసం ఆశపడే వ్యక్తి కాదని కొనియాడారు.   Also read: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య  కావ్య రెడ్డి చేసే బిజినెస్ ఇదేనా!   చాలా కాలం తర్వాత  ఆపరేషన్ అరుణారెడ్డి చేస్తున్నాను. నేనే ద‌ర్శ‌కుడ్ని  ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ కథ ప్రస్తుత సమాజంలో నిజాయితీగా ఉంటే ఎవరూ మెచ్చుకోరని, బలం ఉన్న దొంగలే గొప్పవాళ్లవుతున్నారు. నన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వండి, అనవసరంగా రోడ్డు మీదకు లాగొద్దు. న‌న్ను ఎవరైనా తిడితే మాత్రం గట్టిగా రియాక్ట్ అవుతానని హెచ్చరించారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు  సినీ వర్గాల్లోనూ,రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి..
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త (Gayathri Gupta). కెరీర్ పరంగా ఎంత ధైర్యంగా కనిపిస్తారో, వ్యక్తిగత జీవితంలో అంతకు మించిన పోరాటాన్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె తెలుగువన్‌(TeluguOne)కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గాయత్రి వెనుక ఇంతటి వేదన ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో గాయత్రి తన బాల్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని, చిన్నతనంలో తన తల్లిని కొట్టడమే కాకుండా.. ఏకంగా కరెంట్ షాక్‌లు పెట్టడం, వాతలు పెట్టడం వంటి భయంకరమైన పరిస్థితుల మధ్య తాను పెరిగానని చెబుతూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసుకే తన తల్లికి తాను పుట్టానని, ఆ పరిస్థితుల్లో తన తల్లి కూడా ఎన్నో ఇబ్బందులు పడిందని గాయత్రి వివరించారు. ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లైన వారం రోజులకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అది ఒక టాక్సిక్ మ్యారేజ్ అని, అక్కడ శారీరక, మానసిక వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే అంత త్వరగా ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పెళ్లి అనేది ఒక పెద్ద స్కామ్ అని, ఆడపిల్లలకు రక్షణ లేని చోట ఉండటం కంటే ఒంటరిగా పోరాడటమే మిన్న అని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా గాయత్రి నిర్మొహమాటంగా పంచుకున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ నిజాలు మాట్లాడటం వల్లే తనను కమర్షియల్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని ఆమె ఆరోపించారు. కాస్టింగ్ కౌచ్ వంటి ఇష్యూలపై గళం ఎత్తడం వల్ల కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు తనను పక్కన పెట్టాయని, అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి కానీ, ఒక అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం 'ఫస్ట్ టైమ్' అనే సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నానని, త్వరలోనే సొంతంగా ఒక ప్రేమకథను డైరెక్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని ఆమె వెల్లడించారు. గాయత్రి గుప్త ఫుల్ ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
  బెల్లంకొండసాయి శ్రీనివాస్(Sai Sreenivas)వివాహం కావ్య రెడ్డి(Kavya Reddy)తో జరిగిన విషయం తెలిసిందే. జనరల్ గా మనకి తెలిసిన వాళ్లే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ సంపాదించాలి కాబట్టి అబ్బాయ్, అమ్మాయి ఏ వర్క్ చేస్తుంటారని అడిగే పరిస్థితి. అలాంటిది సాయి శ్రీనివాస్ చేసుకున్న కావ్య రెడ్డి ఏ పని చేస్తుందో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా! మరి అలా తెలుసుకోవాలనే వాళ్లందరి కోసం కొన్ని డీటెయిల్స్   కావ్యరెడ్డి ఒక లాయర్.  మరోవైపు అరటి చెట్టు నుంచి వచ్చే నారని దారాలుగా మార్చి చీరలను తయారు చేసి  విదేశాలకి పంపిస్తుందంట. దీంతో కావ్యకి  నెలకు సుమారు 90 లక్షల ఆదాయం వస్తుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో  తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డినే స్పందించాలి. కావ్యరెడ్డి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది కూతురు అనే విషయం తెలిసిందే. Also read: Rajinikanth: అభిమానులని బాధకి గురి చేస్తున్న రజీనీకాంత్ మాటలు    
'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా 'ఫౌజీ' (Fauzi)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో రావాల్సిన ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ వాయిదాకు కారణాలు: ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సహజంగానే ఇలాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకం. యుద్ధ సన్నివేశాలు, పీరియడ్ సెట్టింగ్స్‌ను అత్యంత నాణ్యంగా తెరపైకి తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీగా ఉన్నాయి. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు హను రాఘవపూడి భావిస్తున్నారు. దీనివల్ల మొదట అనుకున్న దసరా 2026 లేదా డిసెంబర్ విడుదల తేదీలు దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2027లో రానుందా? ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 'ఫౌజీ' సినిమాను 2027 ప్రారంభంలో విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్ తో పాటు, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ జాప్యం ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' (Spirit) పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2027 మార్చి 5న 'స్పిరిట్' ఉండటంతో.. దానికి అడ్డు రాకుండా, గ్యాప్ ఉండేలా 'ఫౌజీ' విడుదలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వాయిదా వార్త ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వస్తే, బాక్సాఫీస్ వద్ద 'ఫౌజీ' సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.  
  అగ్ర నిర్మాత ఆర్ బి చౌదరి(Rb Choudary)రోడ్ యాక్సిడెంట్ లో ఆకస్మిక మరణానికి గురవ్వడం ప్రతి ఒక్కర్ని ఎంతగానో కలిచి వేస్తుంది. ఈ రోజు ఉదయం ఆర్ బి చౌదరి పార్థివ దేహాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ సందర్శించి తన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌదరి గారితో తనకున్న అనుబంధాన్ని రజినీ కాంత్(Rajini Kanth)గుర్తు చేసుకున్నారు. రజినీ మాట్లాడుతూ నేను చౌదరి గారి బ్యానర్ లో చేయకపోయినా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.అప్పుడపుడు కలుసుకునే వాళ్ళం. నాలుగు నెలల క్రితం జైలర్ 2 షూటింగ్ సెట్స్ కి వచ్చి కలిశారు. నాతో మాట్లాడుతూ 99 వ సినిమా చేస్తున్నాను. 100 వ సినిమా చేసి రిటైర్ అవుతా. ఆ సినిమాలో నన్ను చెయ్యాలని అన్నారు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చానని రజినీకాంత్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మాటలు చౌదరి గారి అభిమానులని బాధాసప్తంలో ముంచుతున్నాయి.   also read: Laila: లైలా పట్టుబట్టారు.. 22 ఏళ్ళ తర్వాత అదృష్టవంతులుగా తెలుగు ప్రేక్షకులు            
- "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదు - అన్ని పార్టీల వారు ఈ సినిమాను చూడొచ్చు, బూతు మాటలు, అసభ్యకర సన్నివేశాలు ఉండవు - నా కెరీర్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే, దేశంలోనే ఒక మంచి స్క్రీన్ ప్లే మూవీ అవుతుంది - అప్పటికున్న బెటర్ పొలిటీషయన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చా, ఎవరి దగ్గరా ఏమీ ఆశించలేదు - అందరి సహకారంతో మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా - ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో "ఆపరేషన్ అరుణారెడ్డి" చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి.  నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు.  ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు గారు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు.  తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు..ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. వాళ్లందరికీ నచ్చే చిత్రమిది. వంద చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే రాసిన అనుభవం నాకుంది. అలాగే ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను ఏం చేయగలనో అదే ఈ చిత్రంలో చేశాను. రఘునందన్ రావు గారు అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది. రఘునందన్ రావు గారు కూడా కథ విని బాగుంది మురళి నేను చేస్తా అన్నారు. ఈ సినిమాతో ఆయనకు ఇంతే సంబంధం. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉంది. అతన్ని డీఎంకే, ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి.  రాజకీయంగా బెటర్ అనుకున్నవారికి సపోర్ట్ చేశా. ఈ క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు, చిరంజీవి, జగన్ ఇలా అందరి నాయకులకు సహకారం అందించా. అయితే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఏ పదవులూ తీసుకోలేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా పనిచేశా. అది కూడా నంది అవార్డ్స్ ను సక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం కోరితే ఆ పదవి తీసుకున్నా. నా అధ్వర్యంలో నిర్వహించిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని అప్పటి విపక్ష మీడియా కూడా అభినందించింది. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ - ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రంలో పోసాని గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం వల్ల కేవలం నటన మాత్రమే కాదు డెడికేషన్, సినిమాను కొత్తగా చూసే విధానం నేర్చుకున్నాను. పోసాని గారు ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ ఒక పవర్ ఫుల్ వుమెన్, సెన్సిటివ్, ఎమోషనల్ ను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు డైలాగ్స్, అరుణ పాత్ర స్వభావం ఎలా ఉండాలి అనేది పోసాని గారు ఎంతో సహనంతో నేర్పించారు. ఇలాంటి మంచివారితో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు 
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, సందీప్ కిషన్‌(Sundeep Kishan)తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నటిస్తున్న 23వ చిత్రమిది (SK33). ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది.  ఇక ఇప్పుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ చిత్రం అని అర్థం అవుతోంది. ఇక ఇందులో సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ఆడియెన్స్‌లో ఒక్కసారిగా అంచాల్ని రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వంచర్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. మరి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
1. శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి.. 'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ నివాసానికి.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు.  2. ‘ఫౌజీ’ రిలీజ్ పై కొత్త ట్విస్ట్..  ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఫౌజీ’. సుమారు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి భారీ వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో.. రిలీజ్‌పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దసరా లేదా ఈ ఏడాది చివర్లో రావాల్సిన ‘ఫౌజీ’.. 2027కు వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.  3. ముందుగానే 'పెద్ది' సందడి.. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. 4. అల్లు అర్జున్ రాక ఎప్పుడంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “రాకా” రిలీజ్ పై కొత్త టాక్ మొదలైంది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పారలెల్ గా కొనసాగుతున్నాయి. 5. కార్తీ కొత్త తెలుగు మూవీ లాంచ్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 6. 'బ్లడీ రోమియో'కు బ్రేకులు.. నాని, సుజీత్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'బ్లడీ రోమియో' వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' ఆలస్యమవ్వడమే దీనికి కారణమని సమాచారం. ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుంటూ.. సుజీత్ తన పూర్తి దృష్టిని పవన్ కళ్యాణ్ 'ఓజీ పార్ట్ 2' పనులపై మళ్లించారు. ప్రస్తుతం 'ఓజీ-2' స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. 'బ్లడీ రోమియో' ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. 7. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న 'అగాధ' టీజర్  ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ 'అగాధ' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్షుద్ర పూజలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ సాగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, భయానక వాతావరణం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది.  8. 'రాజ రాజ చోర' దర్శకుడితో రవితేజ మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది. 'రాజ రాజ చోర', 'స్వాగ్' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి చెప్పిన వైవిధ్యమైన స్క్రిప్ట్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' షూటింగ్‌లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. 9. ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ' యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన తొలి సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిరాజు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా.. మే 15న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు 24 గంటల ముందే, అంటే మే 14 నుంచే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. 10. షారుఖ్-దీపికా సాంగ్ వీడియో లీక్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'కింగ్' షూటింగ్ స్పెయిన్‌లో శరవేగంగా జరుగుతుండగా, లీకుల బెడద చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె పాల్గొన్న ఒక సాంగ్ షూటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంగ్ తో పాటు కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా లీక్ అయినట్లు సమాచారం.  
  మాఘమాసం ఎప్పుడొచ్చిందో అని ఆడిపాడి పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు అర్జెంట్ గా పెళ్లి చేసుకునేలా చేసింది లైలా(Laila)..ఇప్పుడు మళ్ళీ అలాగే చేయాలనే ఉద్దేశ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ లో 'గోదారి గట్టుపైన'(Godari Gattupaina)అనే చిత్రంతో రేపు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రీసెంట్ గా  హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో లైన తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో  ఆకట్టుకున్నారు. లైలా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు నా మాతృభాష కాకపోయినా, ఇక్కడి వారు నన్ను తమ ఇంటి అమ్మాయిలా ఆదరించారు. మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.  గోదావరి తీర ప్రాంతంలోని గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  ఒక పవర్‌ఫుల్, ఎమోషనల్ క్యారక్టర్ ని పోషించాను. నా  కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది.  Also read: Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా! రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు పాత రోజులు గుర్తొచ్చాయి. అక్కడి భోజనం ఆతిథ్యం అద్భుతం. దర్శకుడు సుభాష్ చంద్ర నేను నటించాలని పట్టుబట్టి మరి ఒప్పించాడని చెప్పుకొచ్చారు. లైలా 22 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. జగపతి బాబు, సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, రాజీవ్ కనకాల కీలక రోల్స్ లో కనిపిస్తున్నారు.  
 పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి కట్ అవుట్ ని పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రెజెంట్ 'రాకా'(Raaka)తో ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో అయితే చిన్నప్పుడు మనం చెప్పుకొని మర్చిపోయిన చందమామ కథల్ని రాకా కథ గురించి చెప్పుకునేలా చేస్తుంది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గా రాకా గురించిన ఒక ఫ్రెష్ రూమర్ నన్నెవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం  తన బర్త్ డే సందర్భంగా సంవత్సరానికి రెండు చిత్రాలని చేస్తాన ని అల్లు అర్జున్  ప్రకటించాడు. ఈ నేపధ్యంలో రాకా కి ఎక్కువ  టైంని స్పెండ్ చేయకూడదని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో  వచ్చే ఏడాది వేసవి కంటే ముందే రాకా రావచ్చనే మాటలు వినపడుతున్నాయి.లోకేష్ కనగరాజ్ తో కూడా అల్లు అర్జున్  సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు సినిమాలు రావాలంటే రాకా ని త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడనే  రూమర్స్ మొదలయ్యాయి. Also read: VIjay: పీచే ముడ్.. విజయ్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్   రాకా మాత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండనున్నాయి. ఏ విషయంలోను అట్లీ(Atlee)కాంప్రమైజ్ కావడం లేదు. దీపికా పదుకునే పై కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరణ జరుపుకున్న రాకాని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.    
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.