![]() |
![]() |

మహేశ్బాబు హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేసిన 'సర్కారు వారి పాట' సినిమాపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. లేటెస్ట్గా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ ఈ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్లింది. కీర్తి సురేశ్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో 'సర్కారు వారి పాట' రిలీజవుతోంది. దాని కంటే ముందు ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 7న ఆ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా గురువారం నిర్మాతలు తెలియజేశారు.
యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేసిన పోస్టర్లో మహేశ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, జీన్స్తో సాంగ్ పాడుతున్నట్లు పోజిచ్చాడు మహేశ్.
ఫుల్ మాస్ యాక్షన్తో పాటు, ఆడియెన్స్కు మంచి వినోదాన్నిచ్చే కామెడీ సీన్లు కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయని ట్రైలర్ తెలియజేసింది. మహేశ్లోని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే 'పోకిరి', 'దూకుడు' లాంటి సినిమాల్లో మనం చూశాం. ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో తన కామెడీతో మహేశ్ అలరించడం ఖాయమంటోంది చిత్ర బృందం. ''నా ప్రేమని దొంగిలించగలవు.. నా స్నేహాన్నీ దొంగిలించగలవు.. యూ కాన్ట్ స్టీల్ మై మనీ.." అనే డైలాగ్తో మహేష్ బాబు క్యారెక్టర్ ని పరిచయం చేయడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ తెచ్చిందని చెప్పాలి. ట్రైలర్లో చివరలో "ఓ వంద వయగ్రాలు వేసి శోభనం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.. అంటూ మహేష్ రౌడీలను చితక్కొట్టడానికి రెడీ అవడం ఆకట్టుకుంది.
మహేశ్, కీర్తి జోడీ మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్బ్గా పండినట్లు తెలుస్తోంది. సముద్రకని విలన్గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుబ్బరాజు మరో రెండు కీలక పాత్రలు చేశారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్. మది సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ ఎస్సెట్స్గా నిలిచే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించాయి.
![]() |
![]() |