![]() |
![]() |
.jpg)
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన దాదాపు నెల రోజుల తరువాత, రియా చక్రవర్తికి బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రియాను సెప్టెంబర్ 8 న అరెస్టు చేశారు. అయితే, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి బెయిల్ లభించలేదు. సుశాంత్ సిబ్బంది శామ్యూల్ మిరాండా, దీపేష్ సావంత్ లకు సైతం బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు నిన్న వారి జుడిషియల్ కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించింది.
రియా చక్రవర్తికి ఒక లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్పై బెయిల్ లభించింది. "రియా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్కు హాజరవ్వాలి, ఆమె పాస్పోర్ట్ను అక్కడ జమ చేయాలి, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదు, గ్రేటర్ ముంబై నుండి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే దర్యాప్తు అధికారికి తెలియజేయాలి" అని హైకోర్టు పేర్కొంది.
బెయిల్ మంజూరు చేసిన తరువాత, రియా తరపు న్యాయవాది, "సాధారణ డిపాజిట్లపై బెయిల్ మంజూరు చేయాలని మేం అభ్యర్థించాము. బెయిల్ మంజూరైన ముగ్గురి పాస్పోర్టులు సమర్పించాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.
రిపోర్టుల ప్రకారం, రియా తరపు న్యాయవాదులు ఎన్సీబీ అరెస్టును వ్యతిరేకిస్తూ, రియా నుండి ఎటువంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదని వాదించారు. తమ బెయిల్ దరఖాస్తులోనూ, రియా, ఆమె సోదరుడు షోవిక్ తమను 'విచ్-హంట్' తరహాలో లక్ష్యంగా చేసుకున్నారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి నేరపూరిత ఆధారాలు లభించలేదనీ పేర్కొన్నారు. తన ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ క్యూరేటెడ్ గంజాయిని వాడేవాడనీ, "మాదకద్రవ్యాల అలవాటును కొనసాగించడానికి అతను తన దగ్గరున్నవారిని వాడుకున్నాడు" అని రియా ఆరోపించింది.
![]() |
![]() |