![]() |
![]() |
.webp)
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువగా హిట్లు, బ్లాక్బస్టర్లే ఉన్నాయి. ఇండస్ట్రీకి 'భద్ర', 'తులసి', 'సింహ', 'లెజెండ్', 'సరైనోడు', 'అఖండ' వంటి బ్లాక్బస్టర్స్ను ఆయన అందించారు. భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన, కమర్షియల్ సినిమాలు తీశారు. సౌత్ టు నార్త్... ఆయన సినిమాలకు ఫ్యాన్స్ అన్ని భాషల్లోనూ ఉన్నారు. ఆయన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్, డబ్బింగ్ అయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ పాన్ ఇండియా సినిమా ప్రారంభించారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది.
బోయపాటి దర్శకత్వం వహించిన చిత్రం 'అఖండ'కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది. 'ది వారియర్' తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది.
హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. బోయపాటి శ్రీను స్వయంగా గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు బోయపాటికి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు.

![]() |
![]() |