![]() |
![]() |

ప్రకాశ్రాజ్, నవీన్చంద్ర, కార్తీక్రత్నం కీలకపాత్రల్లో నటిస్తోన్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం శుక్రవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో కన్నులపండువగా ప్రారంభమైంది. శ్రీ అండ్ కావ్య సమర్పణలో ప్రొడక్షన్ నం. 6గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థింక్ బిగ్ బ్యానర్పై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్ విజయ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ అధినేత యం. రాజశేఖర్ రెడ్డి, ప్రకాశ్రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్రాజ్, శ్రీ క్రియేషన్స్పై బి. నర్సింగరావులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వాలీ మోహన్దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
సీనియర్ నటుడు తనికెళ్ల భరణి పూజచేసి నిర్మాతలను ఆశీర్వదించటంతో సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్దన మహర్షి, సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా స్క్రిప్ట్ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్కి అందించారు. హీరో నవీన్చంద్ర, కార్తీక్ రత్నంపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు ప్రముఖ నటుడు అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్కు డైరెక్టర్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత యం. రాజశేఖర్ మాట్లాడుతూ, "నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ట్రావెల్ చేయటానికి ముందుకొచ్చిన ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. కథ వినగానే ప్రకాశ్రాజు గారు, ఏ.ఎల్. విజయ్ గారు, నవీన్చంద్ర మనం సినిమా కలిసి చేస్తున్నాం అని నన్ను నమ్మి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు.

నవీన్చంద్ర మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా కథ చాలా స్పెషల్. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్. చక్కని కథలను తెరకెక్కించే నిర్మాత రాజశేఖర్ అన్న నాకు ఎప్పటినుండో మంచి మిత్రుడు. ఎంతోమంది సినిమా పెద్దలు వచ్చి మా సినిమాను బ్లెస్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు.
కార్తీక్ రత్నం మాట్లాడుతూ–‘‘ దర్శకుడు వాలీ కథను ఎంతో కొత్తగా రాసుకున్నారు. నిర్మాత రాజశేఖర్ గారు తెలుగులో నేను నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను తమిళ్లో ‘కేరాఫ్ కాదల్’ పేరుతో తెరకెక్కించి నన్ను తమిళ్కి కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాధిస్తారు’’ అన్నారు.

విజయ్ మాట్లాడుతూ, ‘‘కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా నాకు చాలా ఇష్టం. అలాంటి కథతో రాజశేఖర్ నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బి. నర్సింగరావు, నటుడు రాజారవీంధ్ర, దర్శకుడు శ్రీపురం కిరణ్, ‘గుణ 369’ ఫేమ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, దర్శకులు గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాణీ భోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గురుదేవ్, ఎడిటర్: సతీష్ , ఆర్ట్: హరిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల.

![]() |
![]() |